వినాయకుడిపై వర్మ కామెంట్స్.. విఘ్నేశ్వరుడు ఆహారాన్ని తొండంతో తింటాడా?! కోర్టు శ్రీముఖం
సినిమాల కన్నా వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచే డైరక్టర్ రామ్గోపాల్ వర్మ. తన ట్వీట్స్తో ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోలు, హీరోయిన్లు, సినిమాలు
సినిమాల కన్నా వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచే డైరక్టర్ రామ్గోపాల్ వర్మ. తన ట్వీట్స్తో ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోలు, హీరోయిన్లు, సినిమాలు, దేవుళ్ళు, దెయ్యాలు అనే భేదం లేకుండా... ఇలా ఒకటేంటి అన్ని విషయాలపై తనదైన స్టైల్లో స్పందిస్తుంటాడు. ఎప్పుడూ ఏదోక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. నోరు ఉందికదాని ఏదోటి మాట్లాడి వివాదంలో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే.
దాదాపు రెండేళ్ల క్రితం... వినాయక చవితి సందర్భంగా ఆ దేవుడి మీద చేసిన ట్వీట్లు సంచలనంగా మారింది. ''వినాయకుడు ఆహారాన్ని చేతులతో తీసుకుని తింటాడా? లేక తొండంతోనా?''గణేశుడికి బొజ్జ చిన్నప్పటి నుంచీ ఉందా? లేక ఆపరేషన్ చేసి ఏనుగుతల పెట్టాక పెరిగిందా? ''గణేశుడు ఇతర దేవతల కన్నా ఎక్కువ తింటాడా? అందుకే లావుగా ఉన్నాడా... మిగతా దేవతలంతా సన్నగా ఉంటారు.. కాని ఈయన మాత్రం ఎందుకిలా ఉన్నాడు... నాదొక అమాయకమైన ప్రశ్న.. తన తలనే కాపాడుకోలేని ఓ దేవుడు.. మిగతా వాళ్ల తలల్ని ఎలా కాపాడుతాడు... ఇలా వర్మ తనదైన శైలిలో ట్వీట్లు చేశాడు.
కోట్లాది మంది నమ్మే దైవంపై ఇలా వ్యంగ్యంగా ట్వీట్లు పెట్టడంతో అడ్డంగా దొరికిపోయాడు. అప్పట్లోనే వర్మ ట్వీట్లపై తీవ్ర విమర్శలు తలెత్తాయి కూడా. అయితే విమర్శలతో సరిపెట్టకుండా కొందరు వర్మ మీద కేసు కూడా పెట్టారు. ఇప్పుడా కేసు కోర్టుదాకా వెళ్లింది. ప్రజల మత విశ్వాసాలను అవమానిస్తూ.. వారిని రెచ్చగొట్టేలా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్ మీద ఐటీ చట్టంలోని 66(ఎ) సెక్షన్ - ఐపీసీలోని 295(ఎ) - 505 సెక్షన్లకు అనుగుణంగా న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించేందుకు ముంబైలోని అంధేరీ కోర్టు అంగీకరించింది. జూలై 19లోగా వర్మ కోర్టుకు హాజరు కావాలని, లేదంటే తన న్యాయవాది ద్వారా అయిన స్పందించాలని కోర్టు ఆదేశించింది.
కాగా.. తాను అజ్ఞానంతోనే ఆ ట్వీట్లు చేశానని.. ఎవరి మనోభావాలూ దెబ్బతీయడానికి కాదని, ఒకవేళ ఎవరైనా నొచ్చుకుని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని వర్మ అప్పట్లోనే ట్వీట్ చేయడం గమనార్హం.