శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: గురువారం, 2 జులై 2015 (18:59 IST)

జూలై 7 నుండి బెల్‌గ్రేడ్‌, ప్యారిస్‌లలో నాగార్జున, కార్తీ భారీ షెడ్యూల్‌

కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పి.వి.పి. పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్‌, 'బృందావనం' 'ఎవడు' చిత్రాల యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌కి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్‌ యూరప్‌లో ప్రారంభమవుతోంది. జూలై 7 నుంచి ఆగస్ట్‌ 10 వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో యూరప్‌ లోని రేర్‌ లొకేషన్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లు, కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగుతుంది. 
 
ఈ సందర్భంగా కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ - ''తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ మూవీ చాలా బాగా వస్తోంది. వంశీ పైడిపల్లి సినిమాని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నారు. నా కెరీర్‌లో ఇది చాలా డిఫరెంట్‌ కమర్షియల్‌ మూవీ అవుతుంది. పివిపిగారు ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని చాలా లావిష్‌గా నిర్మిస్తున్నారు'' అన్నారు.
 
కార్తీ మాట్లాడుతూ - ''తెలుగులో ఫస్ట్‌ టైమ్‌ చేస్తున్న స్ట్రెయిట్‌ మూవీ చాలా భారీ లెవల్‌లో నిర్మిస్తున్నారు పివిపిగారు. నాగార్జునగారిలాంటి పెద్ద స్టార్‌తో కలిసి ఈ సినిమాకి వర్క్‌ చేయడం చాలా థ్రిల్లింగ్‌గా వుంది'' అన్నారు.  నిర్మాత ప్రసాద్‌ వి. పొట్లూరి మాట్లాడుతూ - ''నాగార్జున, కార్తీ కాంబినేషన్‌లో మా బేనర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్‌ చెన్నయ్‌లో 20 రోజులపాటు జరిగింది. 
 
రెండో షెడ్యూల్‌ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవన్‌ ఎకర్స్‌లో వేసిన భారీ సెట్‌లో 25 రోజులపాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. జూలై 7 నుంచి జరిగే మూడో షెడ్యూల్‌ యూరప్‌లోని రేర్‌ లొకేషన్స్‌ అయిన సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో స్టార్ట్‌ చేస్తున్నాం. సౌత్‌ ఈస్ట్‌ యూరప్‌లో పెద్ద సిటీ అయిన బెల్‌గ్రేడ్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న మొదటి సౌత్‌ ఇండియన్‌ మూవీ ఇదే కావడం విశేషం. బెల్‌గ్రేడ్‌ తర్వాత ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌, లియాన్‌లలో షూటింగ్‌ జరుపుతాము. స్లొవేనియా రాజధాని అయిన అందమైన సిటీ జబ్లిజనాలో జరుగుతుంది. 
 
ఈ షెడ్యూల్‌లో నాగార్జున, కార్తీ, తమన్నా పాల్గొనే కొన్ని భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు చిత్రీకరించనున్నాం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్న పి.ఎస్‌.వినోద్‌ ఈ షెడ్యూల్‌లో ఎన్నో అందమైన లొకేషన్స్‌ని మరింత అందంగా చూపించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఈ చిత్రంలో ఎంతో కీలకమైన కార్‌ ఛేజ్‌ని ప్యారిస్‌ స్ట్రీట్స్‌లో చిత్రీకరించబోతున్నారు మా డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి. ఈ కార్‌ ఛేజ్‌ ఇండియన్‌ ఫిలింస్‌లోనే ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిపోయే కార్‌ ఛేజ్‌ అవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా వున్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీసుందర్‌ ఈ చిత్రం కోసం చేసిన అద్భుతమైన కొన్ని పాటలను ఈ షెడ్యూల్‌లోనే చిత్రీకరించబోతున్నాం. ఈ మేజర్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసి ఈ ఏడాది చివరలో చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు. 
 
దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - ''సినిమా చాలా బాగా వస్తోంది. మా కథకు హండ్రెడ్‌ పర్సెంట్‌ సూట్‌ అయ్యే నాగార్జునగారు, కార్తీలతో ఇంత భారీ మల్టీస్టారర్‌ చెయ్యడం చాలా చాలా హ్యాపీగా వుంది. పి.వి.పి. లాంటి పెద్ద సంస్థలో చేస్తున్న ఈ సినిమా డెఫినెట్‌గా అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది'' అన్నారు.
 
కింగ్‌ నాగార్జున, 'ఆవారా' కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా, సహజనటి జయసుధలతో పాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌కు సంగీతం: గోపీసుందర్‌, ఫొటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, మాటలు: అబ్బూరి రవి, కథ: వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్‌, ఎడిటింగ్‌: శ్రీకరప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సునీల్‌బాబు, నిర్మాత: ప్రసాద్‌ వి. పొట్లూరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.