శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 నవంబరు 2017 (08:53 IST)

'నంది' రచ్చపై చంద్రబాబు సీరియస్.. రద్దు చేసే యోచన?

బాలల దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. పైగా, ఈ రచ్చపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అవార్డులను రద్దు చేసే

బాలల దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. పైగా, ఈ రచ్చపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అవార్డులను రద్దు చేసే యోచనలో ఏపీ సర్కారు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
రాష్ట్ర విభజన అనంతరం మూడేళ్ల తర్వాత ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నంది అవార్డులు పరిశ్రమలో కల్లోలం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. పరిశ్రమ ఎక్కడున్నా ప్రాంతాలకు అతీతంగా కళాకారులను గౌరవించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు తీవ్ర వివాదాన్ని రేపాయి. 
 
అనుయాయులకు, తమ కులం వారికి ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు మరింత శ్రుతిమించి అవి నంది అవార్డులు కాదు.. సైకిల్ అవార్డులని కొందరు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ విషయంలో సినీ పరిశ్రమ రెండుగా విడిపోయింది. దీనిపై పెద్ద ఎత్తున డిబేట్లు కూడా జరుగుతున్నాయి. 
 
ఈ విషయంలో ఇలాగే మౌనం వహిస్తే తెలుగు సినీ పరిశ్రమతోపాటు ఏపీ ప్రభుత్వానికి కూడా మచ్చ వచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన చంద్రబాబు సర్కారు మౌనం వీడింది. అవార్డుల విషయంలో జరుగుతున్న రాద్దాంతంపై స్పందించింది. ఈ వ్యవహారం మరింత శ్రుతిమించితే ఏకంగా అవార్డులనే రద్దు చేయాలన్న ఆలోచనలో ఉంది. కళాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అవార్డులు ఇస్తుంటే ఈ గోల ఏమిటంటూ ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.  
 
రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణలోనే ఉంటూ, అక్కడే పన్నులు కడుతున్నా తెలుగు వారంతా ఒక్కటే అన్న ఉద్దేశంతో అవార్డులు ఇస్తుంటే అనవసర రాద్దాంతం చేయడం ఎంత వరకు సబబు? అని ప్రశ్నించింది. ఈసారి నంది అవార్డు గ్రహీతల్లో చాలామందికి ఏపీలో కనీసం ఓటు హక్కు కూడా లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది.