శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (15:53 IST)

ఎస్పీ బాలుపై తెలుగు సినీ ప్రముఖులకు ఉండే ప్రేమ అంతేనా?

గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గత శుక్రవారం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు శనివారం ముగిశాయి. ఈ అంత్యక్రియల్లో ఇటు కోలీవుడ్, అటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమల వేళ్ళమీద లెక్కించదగిన వారు మాత్రమే హాజరయ్యారు. ముఖ్యంగా, తమిళ సినీ పరిశ్రమ నుంచి స్టార్ హీరో విజయ్ మాత్రమే బాలు అంత్యక్రియలు హాజరయ్యారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరుకాలేదు. ఇదే ఇపుడు విమర్శలకు దారితీస్తోంది. ఎస్పీ బాలుపై ఎంతో ప్రేమా ఆప్యాయతలు కురిపించిన సినీ సెలెబ్రిటీలు ఆయన పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు లేదా ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఏమాత్రం ఆసక్తి  చూపించలేదు. కానీ, తమ సంతాప సందేశాలను మాత్రం సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా నివాళులర్పించారు.
 
ఇక... తమిళ చిత్ర పరిశ్రమ నుంచి విశ్వనటుడు కమలహాసన్ చివరిసారిగా బాలుని ఆస్పత్రిలో చూసి వెళ్లిపోయారు. ఆయన మృతదేహాన్ని చూసి తాను తట్టుకోలేనని, అందుకే అంత్యక్రియలకు రాలేకపోయానని చెప్పారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా బాలుని ఆ స్థితిలో చూడలేనంటూ ఇంట్లోనే ఉండిపోయారు. మిగిలిన హీరోలు కూడా రాలేదు. కానీ, విజయ్ మాత్రమే బాలు అంత్యక్రియలకు హాజరయ్యారు.
 
అయితే, తెలుగు సినీ ప్రముఖుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరుకాకపోవడమే ఇపుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. కరోనా భయంతోపాటు సినీ ప్రముఖులు చెన్నై వెళితే... భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని, ఈ క్రమంలోనే... వారు చెన్నై వెళ్లలేదని చెబుతున్నారు. కానీ, ఈ సినీ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరైతే భద్రత కల్పించేందుకు వీలుగా 500 మంది పోలీసులను బందోబస్తుగా నియమించారు. అయినప్పటికీ కరోనా మహమ్మారి, భద్రత కారణాలు చూసి తెలుగు ప్రముఖులు డుమ్మా కొట్టడం గమనార్హం.