శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శుక్రవారం, 20 నవంబరు 2015 (18:43 IST)

'ఓ స్త్రీ రేపు రా' ఆడియో

రీడింగ్ లాంప్ క్రియేషన్స్ పతాకంపై అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'ఓ స్త్రీ రేపు రా'. 'కల్పితమా.. ఖచ్చితమా..' అనేది ఉపశీర్షిక. ఆశిష్ గాంధీ, వంశీకృష్ణ, కునాల్ కౌశిక్, దీక్షా పంత్, శ్రుతి మోల్, మనాలి రాథోడ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఘంటశాల విశ్వనాథ్(జివి) సంగీతమందించారు. గురువారం హైదరాబాద్‌లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ, మధుర శ్రీధర్ పాటల సీడీలను ఆవిష్కరించారు.    
 
తమ్మారెడ్డి మాట్లాడుతూ.. "బాహుబలి, శ్రీమంతుడు, రాజుగారి గది.. ఇలా మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ప్రస్తుతం హారర్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. మంచి విజయాలు సాధిస్తున్నాయి. అదే తరహాలో ఈ చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు" అన్నారు. 
 
మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. "పాటలు, ప్రచార చిత్రాలు బాగున్నాయి. ఈ చిత్రం కోసం అశోక్ రెడ్డి ఎంత కష్టపడ్డాడో తెలుసు. ఇటీవల విడుదలయిన 'రాజుగారి గది' తరహాలో ఈ చిత్రం కూడా పెద్ద విజయం సాధించి దర్శక, నిర్మాతకు లాభాలు తీసుకురావాలి" అన్నారు.     
 
అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. "గతంలో కొన్ని గ్రామాలలో తమ ఊళ్లో దెయ్యం తిరుగుతుందనే భయంతో ఇంటి గోడలపై 'ఓ స్త్రీ రేపు రా' అని రాశారు. కొందరయితే గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేసి వెళ్లారు. ఆ ఘటనల స్ఫూర్తితో హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఓ లఘు చిత్రం తీయడానికి సన్నాహాలు చేశాను. మా సహా నిర్మాత ప్రవీణ్ మద్దతుతో చిత్రంగా తీశాం. చిత్ర బృందమంతా కష్టపడి, ఇష్టపడి చేసిన చిత్రమిది. జివి మంచి సంగీతం అందించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు మంచి చిత్రం తీశారంటూ ప్రశంసించారు. మాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. డిసెంబర్ రెండవ వారం లేదా మూడో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
 
సంగీత దర్శకుడు జివి మాట్లాడుతూ.. "పాటలన్నీ బాగా కుదిరాయి. సుభాష్ నారాయణ, పవన్ రాచేపల్లి మంచి సాహిత్యం అందించారు. నేపథ్య సంగీతం కూడా బాగుంటుంది. నాకు అవకాశం ఇచ్చిన అశోక్ రెడ్డికి థాంక్స్" అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ కందుకూరి తదితరులతో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు.