గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (18:19 IST)

'నట సింహం' బాలయ్యను చూసిన ఆమె ఆనందం పట్టలేకపోయింది...

అది హైదరాబాద్‌లోని గోపాలం పల్లి. అక్కడి మంజీరా అపార్ట్‌మెంట్స్‌లో నివశిస్తున్న కుటుంబాల్లో ఓ కుటుంబం ఇవాళ (28.07.2015) పండగ చేసుకుంది. వాళ్లలా ఆనందపడటానికి కారణం నందమూరి నటసింహం బాలకృష్ణ. అక్కడి సమీపంలో బాలయ్య 'డిక్టేటర్' షూటింగ్ జరుగుతోంది. కొన్ని క్లిష్టమైన సన్నివేశాలను చిత్ర దర్శకుడు శ్రీవాస్ చిత్రీకరిస్తున్నారు. నిర్విరామంగా షూటింగ్ చేస్తూ, బిజీబిజీగా ఉన్న బాలయ్యకు ఓ విషయం తెలిసింది.
 
ఓ 90 ఏళ్ల వృద్ధురాలు బాలయ్యను చూడాలనుకుంటోంది. అదీ విషయం. కానీ, ఆ వృద్ధురాలు నడవలేని స్థితిలో ఉంది. మరి.. బాలయ్యను చూడటం ఎలా? స్వయంగా బాలయ్యే ఆమె దగ్గరికెళితే బాగుంటుంది కదా..? బాలయ్య అదే చేశారు. ఆ విషయంలోకి వద్దాం.
 
విజయవాడ కస్తూరిబాయ్ పేటకు చెందిన విజయ లాయర్. రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి, గోపాలంపల్లిలోని మంజీరా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న తన చిన్న కూతురి దగ్గర ఉంటున్నారు. స్వతహాగా మహానుభావుడు ఎన్టీఆర్ వీరాభిమాని అయిన విజయకు తన అపార్ట్‌మెంట్ దగ్గర బాలయ్య షూటింగ్ చేస్తున్న విషయం తెలిసింది. అంతే చూడాలనుకున్నారు. 
 
ఎలాగైనా షూటింగ్ స్పాట్ దగ్గరికి తీసుకెళ్లమని కుటుంబ సభ్యులను కోరారు. కానీ, ఈ విషయం మొత్తం తెలుసుకున్న బాలయ్య తానే స్వయంగా వెళ్లారు. ఆమెను పలుకరించారు. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె కూడా బాలయ్య కుటుంబం గురించి అడిగితే, 'మీ పిల్లలకు పెళ్లయ్యిందా?' అని అడిగారు. 
 
పిల్లల గురించి కూడా బాలయ్య ఆమెకు చెప్పారు. ఎన్టీఆర్ నటించిన 'లవకుశ' చూశానని, మహా నటుడని ఆమె బాలయ్యకు చెప్పారు. అలాగే, 'శ్రీరామరాజ్యం' చిత్రం చూశానని, చాలా బాగా నటించారని బాలయ్యతో ఆమె అన్నారు. అప్పటి రాజకీయాల గురించి కూడా బాలయ్యతో విజయ చర్చించడం విశేషం. బాలయ్య ఇలా తమ ఇంటికి రావడం, కాసేపు గడపడం పట్ల విజయ, ఆమె కుటుంబ సభ్యులు ఆనందించారు.