రుణం తీర్చుకునే పనిలో పడిన పవన్ కల్యాణ్: ఎస్జే సూర్యకి తర్వాత ఎ.ఎం.రత్నంతో సినిమా!
పవన్ కల్యాణ్ తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఖుషి విషయంలో మరింత కృతజ్ఞతతో ఉన్నాడు. ఆ సినిమా డైరెక్టర్ ఫామ్లో లేడని తెలిసి కూడా ఆ మధ్య కొమరం పులి సినిమా చేయడమే కాదు.. అది డిజాస్టర్ అయినా లెక్క చేయకుండా ఉండిన పవన్ కల్యాణ్ ఎస్జే సూర్యతో మళ్లీ కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక తాజాగా ఆ చిత్ర నిర్మాత ఎ.ఎం.రత్నం రుణం కూడా తీర్చేసే పనిలో ఉన్నట్లున్నాడు. ఎస్.జె.సూర్యతో సినిమా తర్వాత పవన్ చేయబోయే 'వేదాలం' రీమేక్ను నిర్మించబోయేది రత్నమేనట.
అసలు వేదాలం రీమేక్ను తెరమీదికి తెచ్చిందే రత్నం అని తెలుస్తోంది. ఒకప్పుడు భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన రత్నం.. మధ్యలో వరుస ఫ్లాపుల కారణంగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఈ మధ్య మళ్లీ సినిమాలు చేస్తూ పైకి లేచే ప్రయత్నంలో ఉన్నాడు. అజిత్తో ఆరంభం, ఎన్నై అరిందాల్, వేదాలం సినిమాలు ఆయన్ని నిలబెట్టాయి.
ఇక తెలుగులోనూ పూర్వ వైభవం పొందాలని చూస్తున్న రత్నం తన నిర్మాణంలో వచ్చిన 'వేదాలం'నే రీమేక్ చేద్దామని నిర్ణయించుకుని.. పవన్ను సంప్రదించాడట. తనకు 'ఖుషి' లాంటి బ్లాక్బస్టర్ ఇచ్చాడన్న కృతజ్నతతో పవన్ ఓకే అనేశాడట. ఈ చిత్రానికి కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకుడని జోరుగా ప్రచారం సాగుతోంది.