మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (10:12 IST)

ప్రతీ ఒక్కరూ ఓటు వేసేలా చైతన్యం తీసుకురావాలి: నరేంద్ర మోదీ

ట్విట్టర్‌ ఉపయోగించడంలో నరేంద్ర మోదీ స్టైలే వేరు. ప్రభుత్వం చేపట్టే పథకాలు, పర్యటనలు వంటి వాటికే కాకుండా ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాల ప్రచారానికి కూడా మోదీగారు ట్విట్టర్‌ను వాడుతున్నారు. ఇటువంటి కార్యక్రమాల ప్రచారంలో దేశంలోని సెలబ్రిటీలను కూడా భాగం చేస్తుంటారు. గతంలో స్వచ్ఛభారత్‌కు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడానికి ఇలానే సెలబ్రిటీల సాయం తీసుకున్నారు.
 
అదేవిధంగా.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను చైతన్యం చేసే పనిలో ఉన్నారు మోదీజి. ఈ ప్రచారంలోనూ సెలబ్రిటీలను మమేకం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం సెలబ్రెటీలను ట్యాగ్ చేస్తూ వరసపెట్టి ట్విట్స్ చేశారు. అంతేకాదు, ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యం తీసుకురావాలని కోరారు. 
 
మోహన్ లాల్, నాగార్జునను ట్యాగ్ చేసి ఓ ట్విట్ చేశారు. డియర్ మోహన్ లాల్, నాగార్జున.. ఎన్నో సంవత్సరాలుగా మీ నటనతో మిలియన్ల కొద్ది ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. దాంతోపాటు ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్నారు. ఇలాంటి మీరు.. భారీ స్థాయిలో ఓటర్లలో అవగాహన కల్పించాలని కోరుతున్నాను. ప్రతీ ఒక్కరూ ఓటు వేసేలా చైతన్యం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నానని మోదీ తన ట్విట్‌లో చెప్పారు. 
 
ఇలా ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, బాలీవుడ్ నటీనటులు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలు, మీడియా పెద్దలు ఇలా అందరినీ మోదీ కోరారు. ఇందులో విశేషమేమిటంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. ఈ జాబితాలో ఉన్నారు. అలానే క్రికెట్ నుండి విరాట్ కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ, కిదాంబి శ్రీకాంత్, పీవి సింధు తదితరులను మోదీ రిక్వెస్ట్ చేశారు.