సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా అక్షయ్కుమార్ విలన్గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీక్వెల్ చిత్రం '2.ఓ'. ఈ సినిమా ఫస్ట్లుక్ విడుదల కార్యక్రమం ముంబైలో ఆదివారం కోలాహలంగా జరిగిన విషయం తెలిసిందే. అత్యాధునిక సాంకేతికతకు దర్పణం పట్టేలా ఈ కార్యక్రమం ఉంటుందని ముందుగానే చిత్రయూనిట్ ప్రకటించింది. ఆ అంచనాకు ఏమాత్రం తీసిపోకుండా ఈ కార్యక్రమం జరిగింది. రజినీకాంత్, అక్షయ్కుమార్, శంకర్, ఏఆర్ రెహ్మాన్, సల్మాన్ ఖాన్ వంటి అతిరథ మహారథులు ఇందులో పాల్గొన్నారు. ఇందులో భాగంగా 'రోబో'లో కనిపించిన చిట్టి రజినీకాంత్ సాంకేతిక మ్యాజిక్తో కనిపించి అలరించారు. పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హిందీ దర్శకుడు కరణ్ జోహార్.. రజినీకాంత్ను వేదికపైకి ఆహ్వానించారు. అప్పుడు అతిథులతోపాటు, ప్రేక్షకులందరూ ఆసక్తిగా వేదికపై చూశారు. కానీ రజినీకాంత్ రాలేదు. అయితే వేదిక ముందు పెద్ద కుర్చీలో 3డీ, సాంకేతిక ఎఫెక్ట్తో విజువల్ మేజిక్తో కనిపించిన చిట్టి రోబో రజినీకాంత్ ప్రత్యక్షమవడంతో హాలు కేకలతో మార్మోగింది.
అలా ప్రత్యక్షమైన రజినీకాంత్ వూరకే ఉంటారా?.. 'కన్నా నా ఎప్పొ వరువేన్, ఎప్పడి వరువేన్.. ఎండ్రు యారుక్కుం తెరియాదు! ఆనా వరవేండియ టైంకు కరెక్టా వందుడువేన్' (నేను ఎప్పుడు వస్తా, ఎలా వస్తా.. అని ఎవరికీ తెలియదు! కానీ రావాల్సిన సమాయానికి కరెక్టుగా వచ్చేస్తా)నని డైలాగు చెప్పడంతో ఆడిటోరియం మార్మోగింది. అనంతరం చిట్టిని పలు ప్రశ్నలు అడిగారు కరణ్జోహార్. అందుకు చిట్టి చెప్పిన సమాధానాలు ఆసక్తిగా అనిపించాయి. ఆ ప్రశ్నలు, సమాధానాలివి...
ప్ర: మిమ్మల్ని డిస్మాంటిల్ చేసి మ్యూజియంలో పెట్టారుగా?
చిట్టి: (పెద్దగా నవ్వుతూ..) నన్ను ఎవ్వరూ అంతం చేయలేరు!
ప్ర: మీ బాస్ గర్ల్ఫ్రెండ్ ఐశ్వర్యను ప్రేమించారే. ఆ ప్రేమ ఏమైంది?
చిట్టి: ప్చ్.. అది ఓ విషాద కథ.
ప్ర: అక్షయ్కుమార్ గురించి ఒక్కమాటలో?
చిట్టి: ట్వింకిల్ ట్వింకిల్ యాక్షన్ స్టార్!
ప్ర: బాలీవుడ్ కింగ్ ఎవరు?
చిట్టి: ది గ్రేట్ అమితాబ్ బచ్చన్.
ప్ర: బాలీవుడ్ క్వీన్ ఎవరు?
చిట్టి: మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్, శ్రీదేవి, ప్రియాంక, దీపికా, కత్రినా, కరీనా, అనుష్కా, రాకీ సావంత్.... (చెబుతూ పోతూంటే...)
ప్ర: డిమానిటైజేషన్ గురించి ఏమైనా తెలుసా?
చిట్టి: దాని గురించి మా బాస్ చెప్పగా తెలుసుకున్నా.
ప్ర: బాస్ అంటే ఎవరు? వశీగరా?
చిట్టి: నో.. శివాజీ ది బాస్.
ప్ర: సినిమా టాగ్లైన్ 'ఈ ప్రపంచం మనుషులకు మాత్రమే కాదు' అని రాశారే అందుకు అర్థమేంటి?
చిట్టి: అందుకు సమాధానాన్ని ఆయనను అడగండి... అంటూ రోబో వేలు చూపించగా.. అప్పుడు అసలైన రజినీకాంత్ వేదిక పైకి ఎంట్రీ ఇచ్చారు. ఈ కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది.