గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 మార్చి 2016 (19:21 IST)

నారా లోకేష్ ఎదగలేడని.. ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారానికి వాడుకుని తరిమేశారు: రోజా

జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఐరన్ లెగ్‌తో తొక్కేస్తున్నారు: రోజా

అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏడాది పాటు సస్పెన్షన్ వేటుకు గురైన వైకాపా ఎమ్మెల్యే రోజా.. టీడీపీ సర్కారుతో పోరుకు సై అంటున్నారు. ఈ క్రమంలోనే సస్పెన్షన్‌పై రెండో సారి సుప్రీం కోర్టు గడప తొక్కారు. సుప్రీంకోర్టులో కేసు వేసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన రోజా.. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఆయనపై మరికొందరిని ఉసిగొల్పే ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
ముఖ్యంగా హరికృష్ణ కుమారుడు హీరో జూనియర్ ఎన్టీఆర్ ఉసిగొల్పేలా రోజా మాట్లాడటం చర్చనీయాంశమైంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఎన్టీఆర్ టైంలో ఉన్నదే తెలుగుదేశం పార్టీ అని... ఇప్పుడు చంద్రబాబు పార్టీ తెలుగు దొంగల పార్టీ అని విమర్శించారు. అప్పట్లో ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన చంద్రబాబు ఇప్పుడు తనను టార్గెట్ చేసి కక్షగట్టారని ఆరోపించారు. ఎన్టీఆర్‌ను ప్రజలు గుర్తుంచుకోవడం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదని.. ఆ కోపంతోనే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా ఆడనివ్వకుండా చేస్తున్నారని ఆరోపణలు చేశారు. 
 
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు విడుదల కానివ్వకుండా ఆడనివ్వకుండా ఐరన్ లెగ్‌తో తొక్కేస్తున్నారని రోజా ఫైర్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల సమయంలో ప్రచారానికి వాడుకుని ఆ తర్వాత టీడీపీలో కార్యకర్తగా కూడా ఉండనివ్వకుండా తరిమేశారని విమర్శలు గుప్పించారు. జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా ముందు తన కొడుకు లోకేశ్ ఎదగలేడన్న భయంతో ఎన్టీఆర్ తొక్కేశారని విమర్శించారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలన్నింటికీ చంద్రబాబు తూట్లు పొడిచారని ఆమె అన్నారు. అలాంటి వాళ్లకు టీడీపీ జెండా ఎగరేసే హక్కుందా అంటూ ప్రశ్నించారు.  
 
ఎన్టీఆర్ పేరుమీద ఉన్న పథకాలన్నింటినీ నిర్వీర్యం చేశారని అదే తన పేరు మీద ఉన్న చంద్రన్న కానుకకకు మాత్రం అడ్డదిడ్డంగా నిధులిస్తూ అందులో అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని విమర్శలు చేశారు. ఎన్టీఆర్ సమైక్యాంధ్రకు కట్టుబడి కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడితే చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌తో చేతులు కలిపి రాష్ట్రాన్ని విడదీశారని చెప్పారు.

ఎన్టీఆర్ సంపూర్ణ మద్యనిషేధం విధిస్తే చంద్రబాబు మాత్రం బెల్టుషాపులతో మద్యాన్ని పొంగిస్తూ ఆడపడుచుల జీవితాలు నాశనం చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ పేరుపై ఎన్టీఆర్ సుజల స్రవంతి, అన్న క్యాంటీన్లు ఆర్భాటంగా ప్రకటించినా ఫలితం లేదన్నారు. కాగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రోజా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది.