శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శుక్రవారం, 31 జులై 2015 (20:36 IST)

సంపూర్ణ భగవద్గీత త్వరలోనే ఒబామా చేతుల మీదుగా అమెరికాలో....

ప్రముఖ సినీ గాయకుడు, సంగీత దర్శకుడు గంగాధర శాస్త్రి ప్రారంభించిన 'సంపూర్ణ భగవద్గీతా గాన యజ్ఞం' పూర్తై, 18 ఆడియో సీడీల రూపంలో విడుదలకు సిద్ధమయింది. అమర గాయకుడు ఘంటసాల గారు భగవద్గీతలోని ఎంపిక చేసిన 106 శ్లోకాలను మాత్రమే గానం చేయగా, హెచ్‌ఎంవీ సంస్థవారు 1974, ఏప్రిల్‌ 21న గ్రామఫోన్‌ రికార్డు రూపంలో విడుదల చేసారు. ఆనాడు ఒక తెలుగు గాయకుడు ప్రారంభించిన గీతాగాన యజ్ఞాన్ని మరొక తెలుగు గాయకుడే పూర్తిచేయాలన్న సంకల్పంతో గంగాధర శాస్త్రి స్వీయ సంగీత సారధ్యంలో తెలుగు తాత్పర్య సహితంగా 700 శ్లోకాల గీతాగాన యజ్ఞాన్ని 2006, జూన్‌ 25న ప్రారంభించారు.
 
8 సంవత్సరాల నిరంతర కృషి ఫలితంగా రూపుదిద్దుకున్న ఈ సంపూర్ణ భగవద్గీత ఆడియో ఆవిష్కరణ మహోత్సవం ఇటీవలే మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీశ్రీశ్రీ విశ్వేస తీర్ధానంద స్వామీజీ వారు సంపూర్ణ భగవద్గీత మొదటి కాపీను విడుదల చేసి మాజీ పార్లమెంట్‌ సభ్యులు కనుమూరి బాపిరాజుకు అందించారు. కమాలనంద భారతి ఆడియో సీడీలను విడుదల చేసి ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం గారికి అందించారు. 
 
ఈ సందర్భంగా విశ్వేసతీర్ధానంద స్వామీజీ మాట్లాడుతూ.. భగవద్గీత భారతదేశపు ధర్మ గ్రంధము. సామాజిక జీవన సందేశం భగవద్గీత నుండి లభిస్తుంది. గంగ, గీతా, గాయత్రి, గోమాత అనే నాలుగు ఘట్టాలు మన సంస్కృతికి ప్రతీకలు. అలాంటి సంస్కృతి ప్రతీక అయిన గీతను అందరికి అర్ధమయ్యే విధంగా గంగాధరశాస్త్రి ప్రచురించినందుకు ఆయనను అభినందిస్తున్నాను. ఈ గీతను రచించి గీతా గంగాధరుడయ్యాడు'' అని చెప్పారు.
 
గంగాధర శాస్త్రి మాట్లాడుతూ... శ్రీ ఘంటసాల గౌరవార్ధం, ఆయన పాడిన 106 శ్లోకాలను యధాతథంగా గానం చేస్తూ, మిగిలిన శ్లోకాలను నా స్వీయ సంగీతంలో తాత్పర్య సహితంగా గానం చేసి 700 శ్లోకాల భగవద్గీతను సంపూర్ణంగా రికార్డు చేసాం. దాదాపు 100 మంది పండితులు, వాద్య కళాకారులు, సాంకేతిక నిపుణులు, భగవద్భందువులు ఈ ప్రాజెక్ట్‌‌కు సహకారం అందించారు. కర్నాటక, శాస్త్రీయ, హిందుస్థానీ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీతాల మేళవింపుగా సాగే ఈ భగవద్గీత శ్రోతల్ని ఆధ్యాత్మిక సంగీత ధ్యానంలోకి తీసుకువెళ్లేట్టుగా సాగుతుంది. 
 
భగవద్గీత మరణ గీతం కాదని జీవన గీతని అందరికీ తెలియబరచడానికే ఈ గ్రంధాన్ని ఆవిష్కరించాం. త్వరలోనే ఈ గ్రంధాన్ని ఆంగ్లంలోకి అనువదించి ఒబామా చేతుల మీదుగా అమెరికాలో విడుదల చేయనున్నాం. దానికి తానా, ఆటా సభలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. భగవద్గీత యూనివర్సిటీను స్థాపించాలనే ధ్యేయంతో ఉన్న మాకు దానికి కావాల్సిన స్థలాన్ని కొందరు పెద్దలు అందించారు. ఈ సభాపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండలి బుద్ధప్రసాద్‌, టి.సుబ్బిరామిరెడ్డి, కె.విశ్వనాధ్‌, పుల్లెల గోపీచంద్‌, సి.జి.కిషన్‌, ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, సిరివెన్నెల సీతారామశాస్త్రి, జానకి, శేఖర్‌ కమ్ముల, విశ్వేశ్వరావు, ఘంటసాల రత్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.