శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

శ్రియ రేటు రూ.5 లక్షలు... నమ్మించిన విలేఖరి... సహకరించిన హీరోయిన్ మేనేజర్

ప్రముఖ టీవీ చానెల్ ఓ రియాల్టీ షోను నిర్వహిస్తోంది. ఈ షోకు న్యాయ నిర్ణేతగా హీరోయిన్ శ్రియను తీసుకొస్తానని ఓ విలేఖరి నమ్మించాడు. ఇందుకోసం రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. ఈ విషయాన్ని శ్రియ మేనేజర్‌కు చెప్పాడు. ఆయన కూడా సరేనంటూ సమ్మతించాడు. చివరకు శ్రియ రాకపోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 5లో నివాసం ఉండే చంద్రాయుడు, ఓ చానల్‌లో రియాల్టీ షోను నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నాడు. దీనికి న్యాయ నిర్ణేతగా శ్రియను పిలిపించాలని భావించాడు. ఈ క్రమంలో చంద్రాయుడికి పరిచయమైన ఓ న్యూస్ పేపర్ విలేకరి, శ్రియకు మేనేజర్‌గా పనిచేసే లక్ష్మీ సింధూజ తనకు పరిచయమని చెప్పాడు. 
 
ఆపై ఆమెను పిలిపించి, ఓ హోటల్‌లో చర్చలు సాగించారు. శ్రియను ఒప్పిస్తానని సింధూజ చెప్పడంతో ఆమె ఖాతాలో రూ.5 లక్షలు జమ చేశాడు. ఆపై నెల రోజులు గడిచినా, శ్రియ రాకపోవడం, సింధూజ, సదరు రిపోర్టర్ అందుబాటులో లేకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారు ఎక్కడున్నారో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.