శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 3 మార్చి 2018 (15:53 IST)

అమ్మా... నువ్వు అతి మంచిదానివి... శ్రీదేవిపై కుమార్తె జాహ్నవి లేఖ(సారాంశం)

అతిలోక సుంద‌రి శ్రీదేవి అనంత లోకాల‌కు వెళ్లిపోవ‌డంతో బోనీ క‌ఫూర్ ఫ్యామిలీతో పాటు యావ‌త్ భార‌త‌దేశంలో ఉన్న అభిమానులను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేసింది. అయితే... అతిలోక సుంద‌రి అయినా... కూతుళ్ల‌కు అమ్మే క‌దా..! అందుక‌నే.. స‌గ‌టు మ‌హిళ లాగే త‌న కుమార్తెల‌ను

అతిలోక సుంద‌రి శ్రీదేవి అనంత లోకాల‌కు వెళ్లిపోవ‌డంతో బోనీ క‌ఫూర్ ఫ్యామిలీతో పాటు యావ‌త్ భార‌త‌దేశంలో ఉన్న అభిమానులను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేసింది. అయితే... అతిలోక సుంద‌రి అయినా... కూతుళ్ల‌కు అమ్మే క‌దా..! అందుక‌నే.. స‌గ‌టు మ‌హిళ లాగే త‌న కుమార్తెల‌ను ఎంతో ప్రేమ‌గా చూసుకునేది. ఆమె పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్ 'ధడక్' చిత్రం ద్వారా బాలీవుడ్‌లో ప్రవేశిస్తోంది. అయితే తన తల్లి మరణం ఆమెను తీవ్ర ఆవేదనకు గురిచేసి ఉండొచ్చు. తల్లి లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరు. 
 
తల్లిపై ఉన్న ప్రేమను ఆమె మరణానంతరం జాహ్నవి లేఖ రూపంలో రాసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అందులో తల్లిదండ్రులను ప్రేమించండి అంటూ పిల్లలకు ఆమె సందేశమిచ్చింది. ఇంకా ఆ లేఖ‌లో ఏం రాసిందంటే..
 
"అమ్మా... నువ్వు మాతో లేకపోయినా ఇప్పటికీ నీ ప్రేమానుభూతిని పొందుతూనే ఉన్నాం. బాధ, విచారం నుంచి నువ్వు నన్ను కాపాడుతున్న భావన కలుగుతోంది. కళ్లు మూసుకున్న ప్రతిసారీ మంచి విషయాలు మాత్రమే నాకు జ్ఞప్తికి వస్తున్నాయి. 
 
అది నీ వల్లేనని నాకు తెలుసు. మా జీవితాలకు నువ్వో వరం. నువ్వు ఈ ప్రపంచం కోసం కాదు. నువ్వు అతి మంచిదానివి, అతి స్వచ్ఛమైన దానివి, అత్యంత ప్రేమమూర్తివి. అందుకేనేమో ఆ దేవుడు నిన్ను తిరిగి తన వద్దకే తీసుకెళ్లిపోయాడు. కానీ, కనీసం మాకైనా నువ్వు లభించావు. నేను సంతోషంగా ఉన్నానని ఎప్పుడూ చెబుతుండేదాన్ని. ఇప్పుడు నాకనిపిస్తోంది అదంతా నీ వల్లేనని. నాకు ఎల్లప్పుడూ కావాల్సింది నువ్వు మాత్రమే. నువ్వు నా ఆత్మలో భాగం. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. నీ జీవితమంతా ఇవ్వడమే చేశావు. అదేవిధంగా నిన్ను తిరిగి సంతోషపెట్టాలని నేను అనుకుంటున్నాను. 
 
నువ్వు గర్వపడేలా చేయాలనుకుంటున్నాను. నిన్ను చూసి మేము గర్వపడినట్లుగా ఏదో ఓ రోజు నన్ను చూసి నువ్వు గర్వపడతావన్న ఆశతో ప్రతిరోజూ కష్టపడుతాను. అదే ఆలోచనతోనే రోజూ నిద్ర లేస్తానని నీకు ఒట్టేసి చెబుతున్నాను. ఎందుకంటే... నువ్వు ఇక్కడే ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. నువ్వు నాలోనూ, చెల్లెలు ఖుషీలోనూ, పాపాలోనూ ఉన్నావు. నువ్వు మాపై వేసిన ముద్ర చాలా బలమైనది. మేము ముందుకు సాగడానికి అది చాలు...." అని జహ్నవి తన తల్లికి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.