నిజాన్ని అంగీకరించిన రాజమౌళి... లచ్చిందేవి ఓ లెక్కుందిలో...
దర్శకుడికి టీమ్ ముఖ్యం. తన అసిస్టెంట్లు చాకుల్లా వుంటే.. దర్శకుడు బాకు అనే పేరు వస్తుంది. అలాంటి వ్యక్తి ఒక్కరు తగ్గినా దర్శకుడు కాస్త ఇబ్బంది పడల్సిందే. ఇదే విషయాన్ని రాజమౌళి తెలియజేస్తున్నాడు. ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ.. చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ పనిచేస్తూ ఉంటారు. ఏమైనా అవకాశాలు వస్తే వెళ్లిపోతుంటారు. బాహుబలి సినిమా సమయానికి నాతో జగదీశ్ లేడు అనేసరికి చాలా టెన్షన్ పడ్డాను. తను లేకుండా సినిమా ఎలా చేయాలనుకున్నాను. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతగా కలిసిపోయాడు. మగధీర సినిమాకు ప్రతిది దగ్గరుండి తనే చూసుకున్నాడు. నేను సెట్లోకి వెళ్లేసరికి అన్ని రెడీగా ఉంచేవాడు. ప్రతి విషయంలో చాలా డీటైల్డ్గా ఉంటాడు. ఎంత డీటైల్డ్గా చెప్తారో ప్రేక్షకులకు అంత బాగా రీచ్ అవుతారు'' అంటూ తెలిపాడు.
నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్ బ్యానర్పై జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయి ప్రసాద్ కామినేని నిర్మిస్తున్న చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్.ఎస్.రాజమౌళి ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి కాపీను శివశక్తిదత్తాకు అందించారు.
ఇంకా రాజమౌళి మాట్లాడుతూ.. ప్రస్తుతం మ్యూజిక్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఓ నాలుగు వారాలు వింటే చాలు అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. అలా కాకుండా స్టాండర్డ్స్ ఉన్న మ్యూజిక్ చేస్తున్న అన్నయ్యకు ధన్యవాదాలు.. అని చెప్పారు. ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ.. అమ్మనాన్న పెట్టిన పేరును మార్చి రైటర్గా మంచి పేరు తెచ్చుకున్న జగదీశ్కు ఓ లెక్క ఉంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేదానికి ఓ లెక్క ఉంది. అలానే లచ్చిందేవికి ఓ లెక్కుంది. ఆ లెక్కను విప్పి చూపించడానికి ప్రయత్నిస్తున్న జగదీశ్కు మంచి సక్సెస్ రావాలి. టీం అందరికి ఆల్ ది బెస్ట్.. అని చెప్పారు.
దర్శకుడు జగదీశ్ మాట్లాడుతూ.. రాజమౌళి, కీరవాణి కుటుంబాలతో ఉన్న సాన్నిహిత్యం వలన నిజాయితీగా ఉండడం నేర్చుకున్నాను. రాజమౌళి గారు నేను ఎక్కువగా మాట్లాడుకోము. ఆయన ఏమైనా చెప్పాలనుకుంటే సైగ చేస్తారు. నాకు వెంటనే అర్థం అవుతుంది. ఈ సినిమాకు మ్యూజిక్ చేయమని కీరవాణి గారిని అడగగానే స్క్రిప్ట్ అంతా చదివి డైలాగ్స్, స్క్రీన్ ప్లే బావుందని చెప్పి మ్యూజిక్ చేయడానికి ఓకే చెప్పారు. మన ఇంట్లో ఉండే లెక్క మనకు తెలుసు. కాని కొన్ని లక్షల కోట్లు మనకు తెలియకుండా అనాధగా పడున్నాయి. వాటికి ఓ లెక్కుంటుందనే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.. అని చెప్పారు.