'కబాలి' టిక్కెట్ల కోసం మంత్రిత్వ శాఖల నుంచి సిఫార్సు లేఖలు!
సాధారణంగా ఉద్యోగం కోసమే.. కాలేజీ సీటు కోసమో... ప్రసిద్ధ దైవదర్శనాల కోసమో మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తీసుకెళ్లడం సర్వసాధారణం.
సాధారణంగా ఉద్యోగం కోసమే.. కాలేజీ సీటు కోసమో... ప్రసిద్ధ దైవదర్శనాల కోసమో మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తీసుకెళ్లడం సర్వసాధారణం. కానీ, ఏదైనా సినిమా టికెట్స్ కోసం థియేటర్ యాజమాన్యాలకు మంత్రులు సిఫార్సు చేయడం గురించి ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా? కానీ, ఇపుడు వింటున్నాం.. చూస్తున్నాం. దీనికి ఈ లేఖే నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించి విడుదలైన చిత్రం "కబాలి". ఈ చిత్రం ఇతర భాషల్లో ఎలా ఉన్నప్పటికీ.. తమిళంలో మాత్రం సూపర్ డూపర్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో ఉన్నఫళంగా చిత్రాన్ని చూడాలన్న కోరిక ప్రతి ఒక్కరిలో నెలకొంది. అయితే, టిక్కెట్లు మాత్రం అందుబాటులోలేవు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో అభిమానులు థియేటర్ యాజమాన్యాన్ని సంప్రదిస్తున్నారు.
తాజాగా, సమాచారం, ప్రసార శాఖ మంత్రికి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్గా ఉన్న వి.ప్రేమ్కుమార్ పేరిట ఓ సిఫార్సు లేఖ విడుదలైంది. ఈ లేఖను స్థానిక పురసైవాక్కంలోని అభిరామి థియేటర్ మేనేజర్కు ఆయన రాశారు. తమ శాఖ అటెండర్ రిజ్వాన్కు పది సినిమా టిక్కెట్లు ఇవ్వాల్సిందిగా అందులో కోరారు. ఈ చిత్రం 22వ తేదీన విడుదల కానుండగా, టిక్కెట్ల కోసం ఈనెల 15వ తేదీనే రాయడం గమనార్హం. ప్రస్తుతం ఈ లేఖ మీడియాకు బహిర్గతమైంది.