వర్మపై క్రిమినల్ కేసు.. ఇచ్చిన మాట తప్పాడు.. రౌడీ పాత్రలో చూపించాడు..
దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై క్రిమినల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. వంగవీటి సినిమా తీసి తమ కుటుంబం పరువును తీశారని వంగవీటి రాధా కోర్టును ఆశ్రయించారు. తమ అభ్యంతరాలను ఏమీ పట్టించుకోకుండా సినిమాను
దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై క్రిమినల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. వంగవీటి సినిమా తీసి తమ కుటుంబం పరువును తీశారని వంగవీటి రాధా కోర్టును ఆశ్రయించారు. తమ అభ్యంతరాలను ఏమీ పట్టించుకోకుండా సినిమాను విడుదల చేశారని ఫిర్యాదు చేశారు. వంగవీటి సినిమాలో రంగాని రౌడీ పాత్రలో చూపించారని పిటిషన్లో ఆరోపించారు. సినిమా తీసే ముందు ఇచ్చిన మాట రాంగోపాల్ వర్మ తప్పారని రాధా తెలిపారు.
ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మపై సెక్షన్ 190, 200 క్రిమినల్ ప్రొసిజర్ యాక్ట్కింద కేసులు నమోదు చేశారు. అయితే వంగవీటి సినిమా విడుదలైన చాలా రోజులకు వర్మపై రాధా కోర్టులో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. సినిమా విడుదలకు ముందు, రిలీజ్ తర్వాత వర్మ, దేవినేని నెహ్రూ, వంగవీటి రాధా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. వర్మ, రాధా మధ్య చోటుచేసుకొన్న వివాదం ఇప్పుడు కోర్టు మెట్లెక్కడంతో మరింత రంజుగా మారింది.
వంగవీటి చిత్రం విడుదల సందర్భంగా రాంగోపాల్ వర్మపై వంగవీటి రాధాకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డబ్బు కోసం వంగవీటి జీవితచరిత్రను కించపర్చేలా చిత్రీకరించి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. డబ్బు కావాలని అడిగితే రంగా అభిమానులు చందాలు వేసుకుని ముఖాన కొట్టేవాళ్లమన్నారని తీవ్రంగా విమర్శించిన సంగతి విదితమే.