మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (18:29 IST)

ఏప్రిల్ 7న బుల్లితెరలో మహానేత 'యాత్ర'

తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో ఆయన చేపట్టిన పాదయాత్ర చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ పాదయాత్రలో ప్రజల కష్టాలను ఆ స్వయంగా చూశారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. 


ఈ పాదయాత్రలో తాను చూసిన ఎన్నో సంఘటనల నుండి ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 వంటి సంక్షేమ పథకాలు పుట్టాయి. ఆ పాదయాత్రను కథాంశంగా చేసుకుని తాజాగా 'యాత్ర' పేరుతో ఓ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. 
 
ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముటి వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో నటించారు. ఆశ్రీత వేమగంటి విజయమ్మ పాత్రను పోషించారు. రావు రమేష్ కెవిపి పాత్రలో నటించారు. ఫిబ్ర‌వ‌రి 8, 2019న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. 70 ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. 
 
ఈ సినిమా దాదాపు 27 కోట్ల గ్రాస్ వసూలు చేసి 2019 లో విడుదలైన హిట్ చిత్రాల సరసన చేరింది. అయితే ఈ మూవీ ఏప్రిల్ 7న మాటీవీలో ప్ర‌సారం చేయ‌నున్న‌ట్టు ఆ ఛానెల్ తెలిపింది. ఏప్రిల్ 11న ఏపీలో ఎల‌క్ష‌న్స్ జ‌ర‌గ‌నుండగా, నాలుగు రోజుల ముందు ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చేయడం ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని ప్రదర్శించవద్దని కొంత మంది కోరుతున్నారు. ఈ చిత్రం టెలికాస్ట్ అవుతుందో లేదో చూడాలంటే 7వ తేదీ వరకు ఆగాల్సిందే మరి..