బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By dv
Last Modified: శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (18:09 IST)

రానా 'ఘాజీ' మంత్రి కేటీఆర్ ట్వీట్... సినిమా ఎలా వుందంటే?

'బాహుబలి' తర్వాత తెలుగులో కల్పిత కథలతో పాటు చరిత్రకు సంబంధించిన కొన్ని కథలు వెండితెరపై ఆవిష్కరించబడుతున్నాయి. రుద్రమదేవి, శాతకర్ణి ఒక తరహా చరిత్ర అయితే.. భారత్‌ నౌకాదళం, పాకిస్తాన్‌ నౌకాదళం మధ్య జరిగిన యుద్ధ నేపథ్యం వైవిధ్యమైంది. 1971లో జరిగిన జలాంత

ఘాజీ నటీనటులు : రానా, తాప్సి, కె.కె మీనన్‌, అతుల్‌ కులకర్ణి, ఓంపురి, సత్యదేవ్‌, భరత్‌రెడ్డి తదితరులు; కెమెరా: మది, సంగీతం: కృష్ణ కుమార్‌, నిర్మాణం : పీవీపీ సినిమా, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌. రచన, దర్శకత్వం :సంకల్ప్‌ రెడ్డి.
 
'బాహుబలి' తర్వాత  తెలుగులో కల్పిత కథలతో పాటు చరిత్రకు సంబంధించిన కొన్ని కథలు వెండితెరపై ఆవిష్కరించబడుతున్నాయి. రుద్రమదేవి, శాతకర్ణి ఒక తరహా చరిత్ర అయితే.. భారత్‌ నౌకాదళం, పాకిస్తాన్‌ నౌకాదళం మధ్య జరిగిన యుద్ధ నేపథ్యం వైవిధ్యమైంది. 1971లో జరిగిన జలాంతర్గామి 'ఘాజీ' యుద్ధం అది. దానికి చిహ్నంగా విశాఖ తీరంలో ఇప్పటికీ జలాంతర్గామి (సబ్‌ మెరైన్‌) వుండటమే నిదర్శనం. ఏదో పనిమీద వైజాగ్‌ వెళ్ళిన సంకల్ప్‌రెడ్డి చూచాయిగా దాని గురించి తెలుసుకున్నాక.. ఆ నేపథ్యంలో యూట్యూబ్‌ సినిమా తీయాలని నిర్ణయించుకుని.. క్రమేణా వెండితెరకు ఎక్కించే స్థితికి తీసుకువచ్చాడు. చరిత్రకు కొంత కల్పన జోడించి తీసిన ఆ చిత్రం ఈనెల 17న తెలుగు, తమిళం, హిందీలో విడుదలయ్యింది. అయితే రెండు రోజుల ముందుగానే తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖులకు ప్రదర్శించారు. ఎలా వుందో చూద్దాం.
 
కథ :
అది 1971వ సంవత్సరం. పశ్చిమ పాకిస్థాన్‌గా పిలవబడే బంగ్లాదేశ్‌లో యుద్ధ వాతావరణ నెలకొంది. అక్కడి శరణార్థులు ఉత్తర పాకిస్తాన్‌ వైపు ఓడలో వెళుతుంటారు. అయితే అక్కడి తమ సైనికులకు సహాయం చేయడానికి కరాచీలో ఉన్న నేవల్‌ బేస్‌ నుండి బంగ్లాదేశ్‌ తీర ప్రాంతానికి 'ఘాజి' అనే సబ్‌ మెరైన్‌ను పాకిస్థాన్‌ నౌకాదళం పంపుతుంది. వెళ్ళే మార్గం భారత్‌ జలాల గుండా మాత్రమే బంగ్లాదేశ్‌ను చేరుకోవాలి. కానీ ఈ మధ్యలో బంగ్లాదేశ్‌ సరిహద్దులో ఉన్న భారతీయ జలాలకు భారత్‌కు చెందిన యుద్ధ వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ కాపలా కాస్తుంటుంది. కనుక ముందు దాన్ని కూల్చి ఆ తర్వాత బంగ్లాదేశ్‌ చేరుకోవాలని ప్లాన్‌ వేస్తారు.
 
విషయాన్ని ఇంటెలిజెన్స్‌ ద్వారా తెలుసుకొన్న భారతీయ నేవీ అధికారులు భారతీయ జలాంతర్గామి ఎస్‌21ను సముద్రంలోకి పంపుతుంది. పంపేటప్పుడు ముక్కుసూటిగా నడుచుకునే కమాండర్‌ రణ్‌ విజయ్‌ సింగ్‌(కేకే మీనన్‌)ను నియంత్రించేందుకు రూల్స్‌ ప్రకారం నడుచుకునేలా చేసే లెఫ్టినెంట్‌ కమాండెంట్‌ అర్జున్‌ వర్మ(రానా)ను తోడుగా పంపిస్తుంది. అందుకే క్లిష్ట పరిస్థితుల్లో యుద్ధం చేయాలంటే బాంబులు (మిసైల్స్‌) వేసేందుకు రెండు కీలు ఇద్దరికీ చెరోటి ఇస్తుంది.  
 
ఇక సముద్రం లోపల 'ఘాజి' ముందుగా ఎస్‌ 21ను ఎదుర్కోవాల్సి వస్తుంది. తమవైపు ఎస్‌21 వస్తుందన్న విషయాన్ని తెలుసుకున్న పాకిస్తాన్‌ నౌకాదళ సిబ్బంది వారిని డైవర్ట్‌ చేయడానికి దగ్గరలో వున్న ఓ ఓడను ధ్వంసం చేస్తుంది. ఇది గ్రహించిన కెప్టెన్‌ విజయ్‌సింగ్‌... ఎత్తుకు పైఎత్తు వేస్తాడు. పాకిస్తాన్‌ కెప్టెన్‌కు చిక్కకుండా తన జలాంతర్గామిని కొన్ని అడుగుల క్రిందకు దింపేస్తాడు. కానీ అప్పటికే అంతరాయంతో కొంతభాగం పాడైపోతుంది. దాంతో తినడానికి ఫుడ్‌ వుండదు. సబ్‌మెరెన్‌లో కొన్ని భాగాలు పాడవ్వడంతో ముందుకు వెళ్ళలేని పరిస్థితి.. ఇలాంటి సమయంలో కెప్టెన్‌ విజయ్‌సింగ్‌, కమాండెంట్‌ అర్జున్‌ వర్మ ఎత్తులతో ఎలా ఘాజీని ఎదుర్కొన్నారనేది సినిమా.
 
విశ్లేషణ:
అసలు కథలో ఏది వాస్తవం.. ఏది అవాస్తమో తెలీదు. అందుకే అప్పటి జలాంతర్గామిలో పాల్గొన్న కొందరిని కలిసి సంకల్ప్‌రెడ్డి రాసుకున్న కథ ఇది. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించాక యుద్ధాలు జరిగినా అవి పెద్దగా ఎవ్వరికీ తెలీవు. అలాంటి యుద్ధాన్ని ఇప్పటి తరానికి తెలియజెప్పే ప్రయత్నం అభింనదించదగింది. కొంత కల్పితమైనప్పటికీ స్పష్టమైన కథను తయారుచేశాడు దర్శకుడు. సినిమా చూస్తున్నంత సేపు కథలో ఎలాంటి గందరగోళం కన్పించదు.
 
సబ్‌ మెరైన్‌ లోపలి సెట్టింగ్స్‌ పరిశోధించి తీశాడు. అలాగే సబ్‌ మెరైన్‌ నీళ్ళలోకి దిగడం, పైకి లేవడం, సముద్రపు అడుగున టార్పీడో (మిసైల్స్‌)లతో పరస్పర యుద్ధం, ఎస్‌ 21, ఘాజి అటాక్‌ నుండి తప్పించుకొని ఎదురు పోరాడటం వంటి వాటిని విఎఫ్‌ఎక్స్‌ ద్వారా సృష్టించడం, సబ్‌ మెరైన్‌లో ప్రతి ఒక్క వ్యవస్థ యొక్క పనితీరు ఎలా ఉంటుంది, క్రూ ఎలా పని చేస్తారు అనేది చాలా బాగా వివరించడం ఆకట్టుకున్నాయి.
 
సహజంగా నౌకాదళంలో వుండే అధికారులు చెప్పేదానికి వాస్తవానికి చాలా వ్యత్యాసం వుంటుంది. దాన్ని కేకే మీనన్‌, రానాల మధ్య తలెత్తే అభిప్రాయం బేధాలను కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ప్రి-క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ ఎపిసోడ్లలో ఇండియన్‌ నేవీ పనితీరును, వేసిన యుద్ధ ప్రణాళికలను చాలా గొప్పగా చూపించారు. ఇందులో ప్రతిఒక్కరూ బాగా నటించారు. కీలకమైన పాత్రల్లో నటించిన రానా, కె.కె మీనన్‌, అతుల్‌ కులకర్ణి, సత్యదేవ్‌ నటన ఆకట్టుకుంది.
 
ద్వితీయార్థంలో భారత్‌ సబ్‌మెరైన్‌ ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో మనవారు వేసిన ఎత్తులే చిత్రానికి ఆకర్షణ. దాన్ని దర్శకుడు చక్కగా డీల్‌ చేశాడు. చివరికు ఘాజీని పేల్చేయడంతో కథ ముగుస్తుంది. కానీ ఎవరి వాదనలు వారివే. అంతర్గత సమస్యతో ఘాజీ పేలిందని పాకిస్తాన్‌ ప్రకటిస్తే.. తామే దానికి కారకులమని భారత్‌ ప్రకటించింది. ఏది ఏమైనా.. హాలీవుడ్‌ చిత్రాల్లో చూసే ఇటువంటి దృశ్యాల్ని తెలుగులో చూపించడం గొప్ప అనుభూతి.
 
'దేశం కోసం ప్రాణత్యాగం చేయడం దేశభక్తి కాదు. ప్రత్యర్థిని ఎదుర్కొని చంపడమే దేశభక్తి అని.. ఎస్‌ 21 కెప్టెన్‌ కెకె మీనన్‌ చెప్పిన డైలాగ్స్‌.. ఇప్పటి జవాన్లు దేశం కోసం ఎంత కష్టపడుతున్నారో అర్థమవుతుంది. ఇదే యువతను దేశభక్తి వైపు మళ్ళించేది.
 
ఎస్‌ 21 కెప్టెన్స్‌ మధ్య అభిప్రాయ భేదాల్లో పైఅధికారుల రాజకీయం కూడా కళ్ళకుకట్టినట్లు చూపించాడు. ఇదిలావుంటే 'ఘాజి'ని కూల్చే సన్నివేశాల్లో ఉత్కంఠత లోపించింది. బంగ్లాదేశ్‌ శరణార్ధిగా తాప్సి పాత్ర వుంది. తను డాక్టర్‌ కూడా కాబట్టి దెబ్బలు తగిలినవారికి కట్టుకట్టే విధానం పాత్రకు న్యాయం చేసింది.
 
సాంకేతిక విభాగం :
సముద్రంలో యుద్ధం, సబ్‌ మెరైన్‌ కదలికలు వంటి అంశాలను విఎఫ్‌ఎక్స్‌ ద్వారా చాలా బాగా సృష్టించారు. సామాన్య ప్రేక్షకులకు సైతం అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా విజువల్స్‌ ఉన్నాయి. మది అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి అంశాన్ని చాలా బాగా ఎలివేట్‌ చేశారు. 
 
ముగింపు :
ఈ చిత్రం తెలుగు పరిశ్రమలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. చరిత్రలో అడుగున పడిపోయిన గొప్ప వీరోచితమైన చరిత్రను సినిమాగా చేసి చెప్పడం నిజంగా మెచ్చుకోదగిన అంశం. మంచి కథ, కథనాలు, ఆకట్టుకునే విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఆర్ట్‌ వర్క్‌, నటీనటుల నటన, కొన్నే అయినా ఆకట్టుకున్న యుద్ధ సన్నివేశాలు ఇందులో ప్రధాన బలాలు కాగా కీలక సన్నివేశాల్లో ఎమోషన్‌ మిస్సవడం, అండర్‌ వాటర్‌ వార్‌ కనుక పెద్దగా యుద్ధ సన్నివేశాలు లేకపోవడం నిరుత్సాహపరిచే అంశం.
 
లోపాలు:
మిగిలిన పాత్రధారుల తీరుతెన్నులు పెద్దగా ఆకట్టుకోవు. ప్రి-క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ ఎపిసోడ్లలో అవసరమైన ఎమోషన్‌ను తగినస్థాయిలో లేవు. దీంతో సినిమా పూర్తిస్థాయిలో ప్రేక్షకుడిని కదిలించలేకపోయింది. సినిమా అంతా సముద్రం అడుగు భాగం జరుగుతుంది కనుక అవి తప్పించి ఏమీ కన్పించవు.