మాస్.. ఊరమాస్ : సామాన్యుడికి - సీఎం కుమారుడికి మధ్య సాగే వార్.. 'సరైనోడు'
చిత్రం.. సరైనోడు
నటీనటులు.. అల్లు అర్జున్, ఆది, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్, శ్రీకాంత్, సాయికుమార్ తదితరులు....
నిర్మాత.. అల్లు అరవింద్
దర్శకత్వం.. బోయపాటి శ్రీను
విడుదల.. శుక్రవారం, 22 ఏప్రిల్ 2016.
అల్లు అర్జున్ హీరోగా, మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'సరైనోడు'. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్ర కథను పరిశీలిస్తే.. ఒక సాధారణ పౌరుడికి... ముఖ్యమంత్రి కుమారుడికి మధ్య సాగే సమరమే. ఈ కథను పరిశీలిస్తే.. రాష్ట్ర ఉన్నతాధికారి కుమారుడైన గణ (బన్నీ) ఉన్నత చదువులు చదివి.. ఆర్మీలో చేరుతాడు. ఆ తర్వాత అక్కడ అంతా సక్రమంగానే ఉందని భావించి.. తిరిగి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి వచ్చి ఆవారాగా తిరుగుతుంటాడు.
ఈ క్రమంలో ఓ అమ్మాయిని ఓ బడా బిజినెస్మేన్ కొడుకు రేప్ చేసి చంపేస్తాడు. ఈ కేసులో తమకు న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే కేథరిన్ను బాధిత యువతి తల్లిదండ్రులు కోరుతారు. ఆమె కూడా ఏంచేయలేనని చేతులెత్తేస్తుంది. ఈ విషయాన్ని గణ తన బాబాయ్ (శ్రీకాంత్) ద్వారా తెలుసుకుని యువతి తల్లిదండ్రులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే హన్సితా రెడ్డి (కేథరిన్)పై మనస్సు పారేసుకుంటాడు. వెంటనే ఐలవ్ యూ చెప్పేస్తాడు. ఆమె చుట్టూ నాలుగు సార్లు తిరిగే సరికి ఆమె గణకు పడిపోతుంది.
అయితే, హత్యకు గురైన యువతిని రేప్ చేసి చంపేసిన నిందితులకు ముఖ్యమంత్రి కుమారుడిగా ఉన్న ఆది అండగా నిలబడి, తీర్పు అనుకూలంగా వచ్చేలా చేస్తాడు. ఈ క్రమంలో గణ... ఆది మనుష్యులను చితక్కొట్టి ఎమ్మెల్యేకు మరింత దగ్గరవుతాడు. చివరకు ఎమ్మెల్యే గణతో పెళ్లికి సిద్ధమై గొడవలకు దూరంగా ఉండాలని అమ్మవారి దగ్గర ప్రమాణం చేయిస్తున్న టైంలో జాను (రకుల్ప్రీత్)ను విలన్లు తరుముతూ అక్కడకే వస్తారు.
జానూను వాళ్లు చంపుతున్న టైంలో ఆమెను చూసి గణ ఆమెను కాపాడటంతో పాటు జానూ తనదే అని చెప్పి అందరికి షాక్ ఇస్తాడు. అసలు జానుకు గనకు గతంలో ఉన్న సంబంధం ఏమిటి? వైరం ధనుష్కు గణకు ముందే ఎలాంటి శతృత్వం ఉంది? మధ్యలో డీజీపీ సుమన్, సీఎంల పాత్రలు ఏంటి చివరకు ఈ స్టోరీ ఎలా మలుపులు తిరిగి ఎలా ముగిసింది అన్నది 'సరైనోడు' సినిమా.