మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 15 జులై 2019 (11:05 IST)

బిగ్ బాస్‌-3పై గాయత్రి గుప్తా ఫిర్యాదు.. నిషేధించాలంటూ శ్వేతారెడ్డి ఫైర్

బిగ్ బాస్ షోపై యాంకర్ శ్వేతారెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. తాజాగా బిగ్ బాస్ షోపై ఫిదా నటి గాయత్రి గుప్తా ఫిర్యాదు చేసింది. బిగ్ బాస్ షో వల్ల ఆరు సినిమాలు వదులుకున్నానని.. తనకు నష్టపరిహారం చెల్లించాలని గాయత్రి గుప్తా ఫిర్యాదు చేసింది.


బిగ్ బాస్ షోకి తాను సెలక్టయ్యానని చెప్పి ఏ ప్రాజెక్టులు ఒప్పుకోవద్దన్నారని.. దీంతో ఆరు సినిమాలు వదిలేసుకున్నానని.. ఆరోపిస్తూ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
బిగ్ బాస్ నిర్వాహకుల మాట విని సినీ ఛాన్సులు వదులుకున్నానని.. చివరికి ఒక రోజు ఫోన్ చేసి సెలక్ట్ కాలేదని చెప్పినట్లు ఆరోపించింది. అంతేగాకుండా.. బిగ్ బాస్‌పై శ్వేతారెడ్డి చేసిన ఆరోపణలే గాయత్రి కూడా చేసింది. బిగ్‌బాస్‌లోకి వెళ్లాలంటే పైవారిని ఎలా సంతృప్తి పరుస్తారని రఘు అడిగారని, అలా ఎందుకని తాను ఘాటుగా ప్రశ్నించానని గాయత్రి తెలిపింది. 
 
బిగ్‌బాస్‌ షోకి రావడానికి సిద్ధమేనా అని రఘు అడిగాడని, వంద రోజులపాటు హౌస్‌లోనే ఉండాల్సి వస్తుందని కూడా అన్నారని గాయత్రి గుప్తా వెల్లడించింది. తాను సరేననడంతో వేరే ప్రాజెక్టులు ఒప్పుకోవద్దన్నారని పేర్కొంది. అభిషేక్, రఘు, రవికాంత్‌లు తన ఇంటికి వచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నారని వివరించింది. 
 
ఆ తర్వాత ఒకరోజు తనకు ఫోన్ చేసి బిగ్‌బాస్ షోకి ఎంపిక కాలేదని చెప్పారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. షోకు ఎంపిక చేశారన్న ఉద్దేశంతో చేతిలో ఉన్న ఆరు సినిమాలను వదిలేసుకున్నానని వాపోయింది. ఆ నష్టపరిహారం ఇవ్వాల్సింగా షో నిర్వాహకులను అడిగానని, వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే పోలీసులను ఆశ్రయించానని గాయత్రి చెప్పుకొచ్చింది.
 
మరోవైపు తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షోగా పేరుగాంచిన బిగ్ బాస్ మూడో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. బిగ్ బాస్-3కి అగ్రహీరో అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ రియాల్టీ షోలో పాల్గొనే సెలబ్రిటీల జాబితా వెల్లడించనున్నారు. అయితే, ప్రముఖ తెలుగు యాంకర్ శ్వేతారెడ్డి బిగ్ బాస్ నిర్వాహకులపై మండిపడుతున్నారు. 
 
బిగ్ బాస్-3ని నిషేధించాలని డిమాండ్ చేశారు. తనను బిగ్ బాస్-3కి ఎంపిక చేసినా, ఇప్పటివరకు అగ్రిమెంట్ పత్రాలు ఇవ్వడంలేదని ఆమె ఆరోపించారు. ఈ మేరకు శ్వేతారెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు బిగ్ బాస్ నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు.