శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 25 అక్టోబరు 2018 (13:44 IST)

సెల్ఫీ పేరుతో జగన్‌పై హత్యాయత్నం.. కోడిపందెం కత్తితో దాడి..

వైకాపా అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. విశాఖపట్టణం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఈ హత్యాయత్న దాడి జరిగింది.
 
సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్‌ జగన్‌పై దుండగుడు దాడి చేశాడు. కోడి పందెలకు ఉపయోగించే కత్తితో అతను జగన్‌పై దాడి చేశాడు. దీంతో వైఎస్‌ జగన్‌ భుజానికి గాయమైంది. 
 
దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌గా గుర్తించారు. దాడి జరిగిన వెంటనే దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
 
ఈ వ్యక్తి జగన్‍పై దాడి చేయడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా, రాజకీయ కక్షలు ఏమైనా ఉన్నాయా, ఏ పార్టీకి చెందిన వ్యక్తి తదితర అంశాలపై విచారిస్తున్నారు. 

294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌ గురువారం హైదరాబాద్‌ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్‌లో ఉండగా.. శ్రీనివాస్‌ అనే వెయిటర్‌.. సెల్ఫీ తీసుకుంటానంటూ వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చారు. 
 
అతను వస్తూనే.. వైఎస్‌ జగన్‌పై కోళ్ల పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్‌ జగన్‌ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ భుజానికి కత్తి తగలడంతో గాయమైంది.

కత్తికి విషపూరిత పదార్థం పూసి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఎయిర్‌పోర్టులో ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన వైఎస్‌.జగన్‌ హైదరాబాద్‌ బయలుదేరారు.