శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 11 జనవరి 2019 (09:20 IST)

అలోక్ వర్మకు ఉద్వాసన.. సీబీఐ డైరెక్టరుగా తెలుగుబిడ్డ

సుప్రీంకోర్టు తీర్పు మేరకు సీబీఐ డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టిన అలోక్ వర్మ ఉద్వాసనకు గురయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఉన్నత స్థాయి కమిటి ఆయన్ను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పించి, అగ్నిమాపక డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. 
 
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సమర్పించిన నివేదికలో అలోక్ వర్మ అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. వీటిని హైపవర్ కమిటీ నిజమేనని నిర్ధారించింది. దీంతో ఆయనపై వేటు వేసింది. 
 
అయితే, వాదనలు వినిపించుకునేదుకు అలోక్ వర్మకు ఓ అవకాశం ఇవ్వాలని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన వినతిని ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గగోయ్ నామినేట్ చేసిన జస్టిస్ ఏకే.సిక్రీలు మాత్రం ససేమిరా అన్నారు. దీంతో అలోక్ వర్మపై అత్యున్నత ఎంపిక కమిటీ 2-1 తేడాతో నిర్ణయం తీసుకుంది. 
 
దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ హైపవర్ కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. సుప్రీం కోర్టు జడ్జి ఏకే సిక్రీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలు పాల్గొన్నారు. అదేసమయంలో సీబీఐ కొత్త డైరెక్టరుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మన్నె నాగేశ్వర రావును తాత్కాలిక సీబీఐ చీఫ్‌గా నియమించింది. 
 
ఇదిలావుంటే, తన తొలగింపుని సవాల్ చేస్తూ అలోక్ వర్మ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. హైపవర్ కమిటీని సంప్రదించకుండా అలోక్ వర్మను సెలవుపై పంపలేరని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో 2019, జనవరి 9వ తేదీ బుధవారం సీబీఐ డైరక్టర్‌గా అలోక్ వర్మ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు తీసుకున్న 24 గంటల్లోనే పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. 2019 జవనరి 31వ తేదీతో అలోక్ వర్మ పదవీ కాలం ముగియనుంది.