శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Updated : బుధవారం, 12 జూన్ 2019 (15:45 IST)

ఒకే ఒక్కడు.. సీఎం జగన్ 'దూకుడు'పై అధికారులు, ప్రజలు ఏమంటున్నారో తెలుసా?

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపైన, ఆయన వ్యవహార శైలిపైన సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఆయన విమర్శకుల అభినందనలు సైతం చూరగొంటున్నారు. విశాఖపట్నం వెళ్లిన జగన్‌ మోహన్‌ రెడ్డికి విమానాశ్రయం వద్ద కొందరు యువతీయువకులు బ్యానర్‌ పట్టుకుని రోడ్డు పక్కన నిలబడివున్న దృశ్యం కనిపించింది. కారు ఆపించి వారి వద్దకు వెళ్లిన జగన్‌…. సమస్య తెలుసుకుని పరిష్కరించారు. ఆందోళన చేస్తున్న వారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు.
 
సమీక్ష సమావేశాల్లో జగన్‌ వ్యవహరిస్తున్న తీరుకు ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులు ముగ్దులవుతున్నారట. ముఖ్యమంత్రి అనే అధికార దర్పంతో కాకుండా… ఇంట్లో మనిషిని పిలిచినట్లు….’అన్నా….’ అంటూ పలకరించడం; తనతో పాటే ఇంట్లో అందరికీ భోజనం పెట్టడం, ఎక్కడా సమీక్షలు నిర్ణీత సమయానికి ప్రారంభించి, నిర్ణీత సమయంలో ముగించడం…. ఇవన్నీ అధికారులకు కొత్తగా అనిపిస్తున్నాయట. ఇప్పటిదాకా జగన్‌ వ్యక్తిత్వంపై జరిగిన ప్రచారంతో భయపడుతూ సమీక్షలకు వెళ్లిన అధికారులు…. జగన్‌ తీరు అబ్బురపరుస్తోందట.
 
ఇక నిర్ణయాల విషయానికొస్తే…. పాదయాత్రలో హామీ ఇచ్చిన ప్రకారం ఆశ వర్కర్ల వేతనం రూ.3000 నుంచి రూ.10,000కు పెంచడం, దశలవారీగా మద్యనిషేధం విధిస్తామంటూ ఇచ్చిన హామీని అమలుచేసే దిశలా చర్యలు చేపట్టడం ఇవన్నీ జనంలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. పాదయాత్ర సమయంలో, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను జగన్‌ నెరవేరుస్తారన్న నమ్మకం ప్రజల్లో కలుగుతోంది.
 
అదేవిధంగా…. ఏపికి అవసరం లేని హైదరాబాద్‌లోని భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఉన్న విభజన గొడవలు సామరస్యంగా పరిష్కారమవుతాయని, రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటుందన్న విశ్వాసం కలిగించగలిగారు.
 
మొత్తంగా ముఖ్యమంత్రిగా జగన్‌ మోహన్‌ రెడ్డి… వేస్తున్న తొలి అడుగులు అందరి అభిమానాన్ని చూరగొంటున్నాయనడంలో సందేహం లేదు. అధికారులతో ఇదే స్నేహపూరిత శైలిని కొనసాగిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వెళితే… ఆయన కచ్చితంగా మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోగలరంటున్నారు రాజకీయవిశ్లేషకులు.