శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 14 మార్చి 2018 (18:02 IST)

తెలంగాణ పాలిట తొలి విలన్ కాంగ్రెస్ పార్టీనే : కేసీఆర్ నిప్పులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ మరోమారు కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తెలంగాణ పాలిట తొలి విలన్ కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ మరోమారు కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తెలంగాణ పాలిట తొలి విలన్ కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసింది జవహర్‌లాల్ నెహ్రూయేనని చెప్పారు. 
 
ఆయన బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో 400 మందిని కాల్సి చంపింది కాంగ్రెస్‌ పార్టీయే. తెలంగాణ ప్రాంతాన్ని భ్రష్టు పట్టించింది కూడా ఆ పార్టీయే. మేం తెలంగాణ కోసం పాటుపడుతున్న సమయంలోనే  రాష్ట్రాన్ని విభజించొద్దని హైకమాండ్‌ను కోరింది కాంగ్రెస్‌ నేతలు కాదా? అలాంటివారు తెలంగాణను ఇచ్చింది మేమేనంటూ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. 
 
1956 నుంచి నేటి వరకు తెలంగాణ వినాశనానికి కారణం ఆ పార్టీయే. తెలంగాణ కోసం ఫ్రంట్‌లు పెట్టిన పలువురు కాంగ్రెస్‌ నేతలు పదవులు రాగానే వాటిని అటకెక్కించారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు నంబర్‌వన్‌ శత్రువని 18 ఏళ్ల క్రితం జలదృశ్యలో చెప్పాను. ఇప్పటికీ వారి ప్రవర్తన అలాగే ఉందని ధ్వజమెత్తారు. 
 
తెలంగాణ కోసం రాజీనామాలు చేస్తామని చెప్పి మాట తప్పారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శాసనసభలో అంటే ఒక్క ఎమ్మెల్యే కూడానోరు మెదపలేదు. ఇలాంటివారా తెలంగాణ గురించి మాట్లాడేది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులైనా నిర్వహిస్తామని చెప్పినా కాంగ్రెస్‌ పార్టీలో ఇంత అసహనం ఎందుకు?’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.  
 
ఇకపోతే, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై బీజేపీఎల్పీనేత కిషన్ రెడ్డి చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు. నాలుగేళ్లలో ప్రభుత్వం లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పడం ఆయన అజ్ఞానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్ర అప్పు రూ.72 వేల కోట్లు ఉంటే.. ఈరోజుకు పాతవి, కొత్తవి అన్ని కలిపి రూ.1.42 కోట్లకు అప్పు చేరిందని కేసీఆర్ అన్నారు.