శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 29 జులై 2018 (17:14 IST)

కర్ణాటక రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వం : బీఎస్.యడ్యూరప్ప

కర్ణాటక రాష్ట్రంలో విభజనవాదం ఊపందుకుంది. ఉత్తర కర్ణాటక జిల్లాలన్నింటిని కలిపి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ నానాటికీ ఉధృతమవుతోంది. దీంతో కర్ణాటకలో కూడా విభజన ఉద్యమం పుట్టుకొచ్చే సూచనల

కర్ణాటక రాష్ట్రంలో విభజనవాదం ఊపందుకుంది. ఉత్తర కర్ణాటక జిల్లాలన్నింటిని కలిపి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ నానాటికీ ఉధృతమవుతోంది. దీంతో కర్ణాటకలో కూడా విభజన ఉద్యమం పుట్టుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప స్పందిస్తూ, ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్ర విభజనకు తాము ఒప్పుకోబోమని, అయితే ప్రయోజనాల సాధనకు మద్దతిస్తామని తెలిపారు.
 
కుమారస్వామి కర్ణాటక మొత్తానికి ముఖ్యమంత్రి అని, కానీ ఆయన మాత్రం 37 నియోజకవర్గాలకు మాత్రమే సీఎంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే భవిష్యత్‌ తరాలు కుమారస్వామిని క్షమించవన్నారు. సీఎం కుమారస్వామి కుటుంబం కేవలం ఉత్తర కర్ణాటకను మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేసిందని విమర్శించారు. 
 
సీఎం కుమారస్వామి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉత్తర కర్ణాటకకు అన్యాయం జరిగిందని యడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరహాలో ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావాలని కొందరు చూస్తున్నారని విమర్శించారు. అలాగే ఈ నెలాఖరులో వాటాల్‌ నాగారాజు ఆధ్వర్యంలో జరిగే కర్ణాటక బంద్‌కు కూడా మద్దతిస్తామని చెప్పారు. ఈ బంద్‌లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో 28 లోక్‌సభ స్థానాలకు 22 లేదా 23 సీట్లలో ఖచ్చితంగా గెలుస్తామని ఆయన జోస్యం చెప్పారు. ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం కోసం శ్రీరాములు డిమాండ్‌ చేయడం లేదని, కేవలం ఉత్తర కర్ణాటక అభివృద్ధి కోసమే ఆయన ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఏ కారణంతోనూ రాష్ట్రం విడిపోవడానికి బీజేపీ మద్దతివ్వదని యడ్యూరప్ప పునరుద్ఘాటించారు.