శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 3 సెప్టెంబరు 2018 (15:26 IST)

ఆనం చేరిక.. మేకపాటి కినుకు.. డోంట్ కేర్ అంటున్న వైకాపా సారథి

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి మరోమారు పార్టీ మారారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కలిగిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణా

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి మరోమారు పార్టీ మారారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కలిగిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన తెలగుదేశం పార్టీలో చేరారు. అయితే ఆయనకు టీడీపీ తగిన గౌరవమర్యాదలు లేకపోవడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన మళ్లీ పార్టీ మారారు.
 
పాదయాత్రలో ఉన్న వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఆనం రామనారాయణ రెడ్డి, రంగమయూర్‌ రెడ్డిలను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆనం వెంట వెళ్లిన అనుచరులను సైతం జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌ యాదవ్‌, గోవర్థన్‌ రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 
అయితే, ఆనం రామనారాయణ రెడ్డితో నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వర్గం కినుకు వహించింది. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డితో పాటు ఆయన తనయుడు, ఆత్మకూరు వైకాపా ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, ఉదయగిరి ఇన్‌చార్జి మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి, సూళ్లూరుపేట వైకాపా ఎమ్మెల్యే సంజీవయ్య, వెంకటగిరి ఇన్‌చార్జి బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, గూడూరు ఇన్‌చార్జి మేరిగ మురళి, కోవూరు ఇన్‌చార్జి ప్రసన్నకుమార్‌ రెడ్డిలు ఈ కార్యక్రమానికి హజరు కాలేదు. 
 
రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరబోతున్నారనే విషయంలో జిల్లా ప్రజలకు అనుమానం లేదు. కానీ ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు అనే విషయంలో మాత్రం చివరి నిమిషం వరకు సస్పెన్స్‌ కొనసాగింది. అయితే పార్టీలో చేరిక సందర్భంగా ఆ విషయంలోనూ క్లారిటీ వచ్చినట్లు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో ఆనం వెంకటగిరి నుంచి బరిలోకి దిగనున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి.