గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 9 ఆగస్టు 2018 (17:13 IST)

రూ.500 జీతం నుంచి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ స్థాయికి...

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక గురువారం జరిగింది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు. దీంతో ఆయన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేప

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక గురువారం జరిగింది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు. దీంతో ఆయన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఆయన బయోగ్రఫీని పరిశీలిస్తే...
 
హరివంశ్ నారాయణ్ సింగ్ ఓ సాధారణ పాత్రికేయుడు. అలా తన జీవితాన్ని ప్రారంభించిన ఆయన.... 40 యేళ్లపాటు ఎన్నో పత్రికలకు తన సేవలు అందించారు. చాలా ఏళ్ల పాటు పాత్రికేయ వృత్తిలోనే ఉన్న ఆయన రాజకీయ రంగం వైపు అడుగు పెట్టి జేడీయూ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవిని దక్కించుకున్నారు. జేడీయూ నుంచి వచ్చి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికైన తొలి వ్యక్తి ఈయనే కావడం విశేషం. 
 
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా ప్రాంతంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో 1956, జూన్‌ 30న హరివంశ్‌ జన్మించిన ఆయన బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ)లో ఆర్థికశాస్త్రం‌లో పీజీ చేశారు. అదే యూనివర్సిటీలో జర్నలిజంలో పీడీ డిప్లొమా చేశారు. 
 
ఆయన కాలేజీ రోజుల్లోనే ప్రముఖ సామాజిక వేత్త జయప్రకాశ్‌ నారాయణ్‌(జేపీ) సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. 1974లో జరిగిన జేపీ ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొనడమే కాకుండా క్రియాశీలకంగా వ్యవహరించారు. 
 
ఆ తర్వాత 1977లో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ట్రైనీ జర్నలిస్ట్‌గా చేరారు. పిమ్మట 1981లో ముంబైకి చెందిన ధర్మయుగ్‌ మ్యాగజైన్‌లో పని చేశారు. 1981 నుంచి 84 వరకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పని చేశారు. అక్కడ నుంచి అమృత బజార్‌ పత్రిక మ్యాగజైన్‌ రవివార్‌కు అసిస్టెంట్‌ ఎడిటర్‌గా 1989 వరకు అక్కడే పని చేశారు. 
 
ఆ తర్వాత హరివంశ్‌ రాంచీకి చెందిన ఉషా మార్టిన్‌ గ్రూప్‌ పత్రిక ప్రభాత్‌ ఖబర్‌లో పని చేశారు. దాదాపు 25 ఏళ్ల పాటు ఎడిటర్‌గా ఆ పత్రికకు సేవలు అందించారు. పాత్రికేయ రంగంలో ఆయన అందిస్తున్న విశేషమైన సేవలను గుర్తించిన జేడీయూ ఆయనకు 2014లో టికెట్‌ ఇచ్చింది. 
 
2014లో ఆయన జేడీయూ తరపున పోటీ చేసి విజయం సాధించి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని పి.చంద్రశేఖర్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు పైగా, అడిషనల్‌ మీడియా అడ్వైజర్‌గా కూడా పని చేశారు. నెలకు రూ.500 వేతనంతో తన తొలి ఉద్యోగాన్ని ప్రారంభించిన హరివంశ్ ఇపుడు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.