శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (14:34 IST)

అమరావతిపై బెడిసికొట్టిన ప్రభుత్వ వ్యూహం... నిజాన్ని వెల్లడించిన ఐఐటీ-మద్రాస్

అమరాతిపై దుష్ప్రచారం చేసేలా కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సర్కారుకు గట్టి షాక్ కొట్టింది. రాజధాని నిర్మాణం కోసం ఎంపిక చేసిన అమరావతి ప్రాంత మట్టిలో గట్టితనం లేదనీ, నిర్మాణ వ్యయం చాలా ఎక్కువగా ఉంటందని ఐఐటీ మద్రాస్ ఓ నివేదిక ఇచ్చినట్టు ప్రభుత్వం చెప్పింది. పైగా, ఇదే విషయాన్ని బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలోనూ ప్రముఖంగా ప్రస్తావించింది. అయితే, అమరావతి సురక్షితం కాదని తాము ఎలాంటి నివేదిక ఇవ్వలేదని ఐఐటీ-ఎం స్పష్టం చేసింది. ఈ మేరకు అమరావతి రైతుల జేఏసీ రాసిన ఈమెయిల్‌కు ఐఐటీఎం సమాధానం ఇచ్చింది. దీంతో ప్రభుత్వం వ్యూహం బెడిసికొట్టినట్టయింది. 
 
రాజధాని కోసం ఎంపిక చేసిన భూముల్లో భారీ నిర్మాణాలు సాధ్యం కాదనీ, నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని బీసీజీతో పాటు.. వైకాపా మంత్రివర్గంలోని మంత్రులు పదేపదే చెబుతూ వచ్చారు. ఈ కథనాలను పలు జాతీయ మీడియాలు ఉటంకించాయి. ఈ నేపథ్యంలో అసల వాస్తవమేంటో తెలుసుకునేందుకు అమరావతి రైతుల జేఏసీ ఐఐటీ మద్రాస్‌కు ఓ ఈమెయిల్ పంపించింది. దీనికి ఐఐటీఎం సమాధానం ఇస్తూ రిప్లై ఈమెయిల్ చేసింది. 
 
ముఖ్యంగా, నేల గట్టితనం, భారీ నిర్మాణాలకు అయ్యే ఖర్చుపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలంటే మెటీరియాలజీ అనే విభాగం ఉండాలనీ, అలాంటి విభాగమే క్యాంపస్‌లో లేదని తేల్చి చెప్పింది. దీంతో అమరావతిపై మంత్రులు చేసిన ప్రకటనలు, బీసీజీ ఇచ్చిన నివేదిక తప్పని తేలిపోయింది.