శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 అక్టోబరు 2019 (14:32 IST)

బ్రేకింగ్ న్యూస్ : పాక్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపుదాడులు

గత కొన్ని రోజులుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలకు చెందిన స్థావరాలపై భారత ఆర్మీ మరోమారు మెరుపుదాడులు నిర్వహించింది. తద్వారా తాము కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే దెబ్బ ఎలా ఉంటుందో రుచిచూపించింది. 
 
ఆదివారం ఉదయం కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూట్లు పొడస్తూ.. కుప్వారా జిల్లాలోని తాంఘర్ సెక్టార్‌లో భారత బలగాలపైకి కాల్పులు జరిపాయి. దీంతో భారత ఆర్మీ.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించింది. ఆర్టిలరీ గన్స్‌ను ఉపయోగించి.. ఉగ్ర క్యాంపులే లక్ష్యంగా కాల్పులకు దిగింది. ఈ దాడిలో పలు ఉగ్ర స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 
 
అంతేకాదు ఐదుగురు పాక్ ఆర్మీ జవాన్లు చనిపోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని నీలమ్ వ్యాలీలోని నాలుగు ఉగ్రస్థావరాలను టార్గెట్ చేస్తూ భారత ఆర్మీ బాంబుల వర్షం కురిపించింది. దీంతో ఆ నాలుగు క్యాంపులు నేలమట్టమైనట్లు ఇండియన్ ఆర్మీ వర్గాల సమాచారం. 
 
ఓ వైపు కాల్పులు జరుపుతూ.. మరోవైపు నుంచి ఉగ్రవాదులను భారత్‌లోకి చొరబడేలా చేస్తుండటాన్ని భారత ఆర్మీ గుర్తించింది. దీంతో అప్రమత్తమైన భారత ఆర్మీ.. పాక్ ప్రేరేపిత ఉగ్ర స్థావరాలపై దాడులకు దిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బుల్లెట్ల వర్షం కురిపించింది. 
 
భారత సైన్యం కాల్పుల్లో పాకిస్థాన్‌‌వైపు కూడా భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. దేశ సరిహద్దులతో పాటు.. దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు.