శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 11 మే 2018 (11:57 IST)

ఔను.. నా తల్లిది ఇటలీనే.. భారత్ కోసం ఎన్నో త్యాగాలు చేసింది : రాహుల్ గాంధీ

తన తల్లి సోనియా గాంధీని ఓ విదేశీయురాలు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనదైనశైలిలో కౌంటరిచ్చారు. ఔను నా తల్లిది ఇటలీనే.. కానీ, భారతదేశం కోసం ఎన్నో త్య

తన తల్లి సోనియా గాంధీని ఓ విదేశీయురాలు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనదైనశైలిలో కౌంటరిచ్చారు. ఔను నా తల్లిది ఇటలీనే.. కానీ, భారతదేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఎన్నో కష్టాలు అనుభవించింది. ఆమె ఉత్తమ భారతీయురాలు అంటూ సూటిగా సమాధానమిచ్చారు.
 
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో చివరిరోజైన గురువారం ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ విదేశీమూలాలను మోడీ ఎద్దేవా చేయడంపై స్పందించిన రాహుల్.. అవును, మా అమ్మ ఇటాలియన్. తన జీవితంలో ఎక్కువకాలం ఆమె ఇక్కడే జీవిస్తున్నారు. ఈ దేశం కోసం ఆమె తన జీవితాన్నే త్యాగం చేశారు. దేశం కోసం ఎన్నో బాధలు అనుభవించారు. నేను చూసిన ఎంతోమంది భారతీయులకన్నా ఆమె ఎక్కువ భారతీయురాలు అని రాహుల్ ఉద్వేగపూరితంగా వ్యాఖ్యానించారు. 
 
ప్రధాని మోడీ చేసే ఇలాంటి వ్యాఖ్యలు ఆయన చౌకబారుతనాన్ని బయటపెడతాయని, ఇంకా ఇలాంటి వ్యాఖ్యలే చేయాలనుకుంటే ఆయనిష్టమని అన్నారు. ప్రధానమంత్రి కావాలన్న తన ఆకాంక్షను మోడీ ప్రచారసభల్లో ఎద్దేవా చేయడంపై రాహుల్ స్పందించారు. మోడీ తనలో ఓ ముప్పును, ప్రమాదాన్ని చూస్తున్నారని, అందుకే ప్రధాని కావాలన్న నా ఆకాంక్షను వెల్లడించగానే ఆయన తట్టుకోలేకపోయారని రాహుల్ చెప్పారు. ప్రధానితో ఎలా తలపడాలో నాకిప్పుడు అర్థమైందన్నారు. 
 
కాంగ్రెస్ దళితులకు ప్రాధాన్యమివ్వట్లేదని, అంబేద్కర్‌కు భారతరత్న కూడా ఇవ్వలేదని ప్రధాని మాట్లాడుతున్నారు. మరి దళితులను హింసిస్తున్న బీజేపీని ఏమనాలి? పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల మృతిపై మోడీ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? దేశవ్యాప్తంగా దళితులపై ఆకృత్యాలు తీవ్రమవుతున్నా ఆయన నోరెందుకు విప్పడం లేదు? దళితుల ఛాతీపైన కులం పేరు రాసిన ఘటనపై మోడీ స్పందించరేం? అని రాహుల్ ప్రశ్నించారు.