మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 18 జనవరి 2019 (08:53 IST)

పాడె మోసేందుకురాని ఆ నలుగురు.. సైకిల్‌పై శవాన్ని తరలించిన కుమారుడు

ఆధునిక సమాజంలో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. హైటెక్ యుగంలో కూడా కులాలు, మతాల, చిన్నాపెద్దా అనే తారతమ్యాలు తారా స్థాయిలోనే ఉన్నాయని మరోమారు నిరూపితమైంది. ఫలితంగా మనిషి జీవించివున్నపుడే కాదు.. చనిపోయిన తర్వాత కూడా దగ్గరకు రావడం లేదు. తాజాగా ఒడిషాలో తక్కువ కులానికి చెందిన ఓ మహిళ కన్నుమూసింది. ఆమె పాడె మోసేందుకు ఆ గ్రామానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో ఆ మహిళ కుమారుడే సైకిల్‌పై శవాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఒడిషా రాష్ట్రంలోని కర్పాబహాల్ గ్రామానికి చెందిన జాంకి సిన్హానియా (45) అనే మహిళకు భర్త చనిపోయాడు. ఈమె తన కుమారుడు సరోజ్ ‌(17)తో కలిసి ఉంటోంది. వీరిద్దరూ కూలీపని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల మంచి నీళ్ల కోసం బావి వద్దకు వెళ్లి అదుపు తప్పి అందులో పడి చనిపోయింది. 
 
దీంతో తన తల్లి అంత్యక్రియలకు సహకరించాలని సరోజ్‌ గ్రామస్తులను కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఒక్కడే తల్లి శవాన్ని సైకిల్‌‌పై తీసుకెళ్లి గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో ఖననం చేశాడు. అంత్యక్రియలకు సహకరించాలని గ్రామస్తులను వేడుకున్నప్పటికీ.. ఎవరూ ముందుకు రాలేదని సరోజ్‌ వాపోయాడు. తక్కువ కులానికి చెందిన వాళ్లమని గ్రామస్తులంతా తమను దూరం పెట్టారని కన్నీరుమున్నీరయ్యాడు. ఈ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.