శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 6 ఆగస్టు 2018 (14:09 IST)

మా కూటమి ప్రధాని అభ్యర్థి మమతా బెనర్జీనే : దేవెగౌడ

కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేయనున్న మూడో కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అని మాజీ ప్రధాని, జేడీఎస్ గౌరవాధ

కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేయనున్న మూడో కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అని మాజీ ప్రధాని, జేడీఎస్ గౌరవాధ్యక్షుడు దేవెగౌడ వ్యాఖ్యానించారు. అయితే, ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకభూమిక పోషించనుందని ఆయన వెల్లడించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పటిష్ట కూటమిని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ప్రధాని పదవికి ప్రతిపక్ష కూటమి అభ్యర్థిగా పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని ప్రతిపాదించేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. అయితే, బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య కూటమి రూపకల్పనలో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన భూమిక అని చెప్పారు. 
 
ఇకపోతే, మూడో కూటమి ఏర్పాటు ఇంకా తొలి దశలోనే ఉందని, బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న మమతను ప్రధాని అభ్యర్ధి చేయడం స్వాగతనీయమేనని చెప్పరాు. 'ఇందిర 17 ఏళ్లు ప్రధానిగా పాలించారు. పురుషులు మాత్రమే ప్రధాని ఎందుకు కావాలి? మమత, మాయావతి ఎందుకు కాకూడదు?' అని దేవెగౌడ ప్రశ్నించారు. 
 
అయితే, దేవెగౌడ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్. జైపాల్ రెడ్డి స్పందించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కోవాలని విపక్షాలన్నీ నిర్ణయించాయని తెలిపారు. విపక్షాల తరపున ప్రధాని అభ్యర్థిని మాత్రం ఎన్నికల తర్వాతే ఎన్నుకుంటామని స్పష్టంచేశారు. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వైఖరి స్పష్టంగా ఉందన్నారు.