శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By

బర్త్‌డే బాష్‌లో అమానుషం.. యువతిపై రెండు ప్రాంతాల్లో గ్యాంగ్ రేప్

పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పుట్టిన రోజు వేడుకల్లో ఓ యువతిని సామూహిక అత్యాచారం జరిపారు. ఆ తర్వాత మరో ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ కూడా అత్యాచారం జరిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జలంధర్‌కు చెందిన 24 యేళ్ళ యువతికి ఐదు నెలల క్రితం భోలు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. మత్తు పదార్థాలకు బానిసైన అతడు కొద్ది రోజుల్లోనే వాటిని ఆమెకూ అలవాటు చేశాడు. తర్వాత డ్రగ్స్‌ను విక్రయించే సోనూకు ఆ యువతిని పరిచయం చేశాడు. సోనూ లక్నోఖాన్‌పూర్‌ ఖోలేలోని తన స్నేహితుడు సిరికి చెందిన గదిలో ఆమెకు బస కల్పించాడు. తర్వాత తరచూ ఆమె దగ్గరకు వస్తుండేవాడు. అలాగే, ఇతర డ్రగ్స్‌ విక్రేతలతో కలిసి ఆమె ద్వారా మత్తుపదార్థాలు కూడా సరఫరా చేయించేవాడు. 
 
కాగా, ఈ నెల పదో తేదీన సిరి తన పుట్టిన రోజు సందర్భంగా కొందరు స్నేహితులను తన రూమ్‌కు పిలిచాడు. రూమ్‌లో డీజే పెట్టుకుని విందు చేసుకున్నారు. ఈ పార్టీలో మద్యం సేవించడంతో పాటు డ్రగ్స్ తీసుకున్న సిరి స్నేహితుల బృందం... ఆ రూమ్‌లో ఉన్న ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తనను రక్షించాలంటూ పెద్దపెట్టున కేకలు పెట్టినప్పటికీ డీజే సౌండ్‌లో ఆమె కేకలు వినిపించలేదు. చివరకు బాధితురాలు ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని పొరుగునున్న దయాల్‌పూర్‌ గ్రామానికి వెళ్లి, సెక్యూరిటీ గార్డుగా పనిచేసే సత్పాల్‌ను ఆశ్రయం కోరింది. పరిస్థితిని గమనించిన అతడు... తనతోపాటు స్థానిక పరిశ్రమలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే మరో ముగ్గురితో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. 
 
వంచనకు గురై భోరున విలపిస్తూ తన గదికి చేరుకున్న ఆ యువతి... జరిగిన విషయాన్ని సిరి కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు సహకరించాల్సింది పోయి... ఆమెను తీవ్రంగా కొట్టి, గది నుంచి బయటకు గెంటేశారు. బాధితురాలు సుభాన్‌పూర్‌ ఠాణాకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకోవడంతో శనివారం ఈ విషయం వెలుగుచూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు... ఆమెకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స ఇప్పిస్తున్నారు. ఈ అకృత్యానికి పాల్పడిన పది మందిలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేయగా, పరారీలో ఉన్న నలుగురు కోసం గాలిస్తున్నారు.