శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: బుధవారం, 16 జనవరి 2019 (18:55 IST)

కోడి పందేలపై ఏపీలో రూ. 2000 కోట్ల బెట్టింగా? వామ్మో...!!?

క్రికెట్ పైన బెట్టింగులు కోట్లలో జరుగుతాయని విన్నాం. కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా రూ. 2000 కోట్లు చేతులు మారినట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి 14 భోగి పండుగ నుంచి కోడి పందేలు జోరుగా మొదలయ్యాయి. కోడి పందెం అనేది ఎప్పటి నుంచో వస్తున్న క్రీడ. దీనిపై బెట్టింగులు అనేవి కామన్. ఐతే ఈ ఏడాది అది ఏకంగా రూ. 2000 కోట్ల వరకూ వెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కిపోయింది. 
 
ఐతే కోడి పందేలపై పోలీసులు వార్నింగులు ఇచ్చారు. ఎక్కడైనా కోడి పందేలు, బెట్టింగులు జరుగుతున్నట్లు తెలిస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఐతే పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కొందరు సంప్రదాయ క్రీడలంటూ పెద్దఎత్తున కోడి పందేలను నిర్వహించారు. కొందరు రాజకీయ నాయకుల కనుసన్నల్లో ఈ పందేలు సాగినట్లు చెపుతున్నారు. 
 
ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఈ పందేలను గ్రామీణ ప్రాంతాల్లోని శివారు ప్రాంతాల్లో నిర్వహించినట్లు తెలుస్తోంది. ఐతే కోడి పందేలు జరుగుతున్న ప్రాంతాలకు పాత్రికేయులను సైతం అడ్డుకున్నట్లు సమాచారం. ఎంతో పగడ్బందీగా కోడి పందేలను నిర్వహించారనీ, ఈ వ్యవహారంలో కోట్ల రూపాయాల్లో చేతులు మారినట్లు చెపుతున్నారు.