మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 అక్టోబరు 2019 (09:15 IST)

అధికారం పంచుకుంటామంటేనే మద్దతు : మొండికేసిన శివసేన

మహారాష్ట్రలో అధికారాన్ని పంచుకునేందుకు ముందుకు వస్తేనే మద్దతిస్తామని శివసేన తేల్చి చెప్పింది. లేనిపక్షంలో మద్దతిచ్చే ప్రసక్తే లేదని కమలనాథులకు స్పష్టం చేశారు. దీంతో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. 
 
ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ - శివసేన కూటమి తిరిగి అధికారాన్ని దక్కించుకున్నాయి. అయితే, గత 2014 ఎన్నికలతో పోల్చితే సీట్లు తగ్గాయి. ఇపుడు ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. 
 
ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకునే విషయమై ప్రతిష్ఠంభన ఏర్పడటంతో, ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతోంది. రెండు పార్టీలూ రెండున్నరేళ్ల చొప్పున సీఎం పీఠాన్ని పంచుకోవాల్సిందేనని, తమ పార్టీ యువనేత ఆదిత్య ఠాక్రేకు తొలి రెండున్నరేళ్లూ సీఎంగా చాన్స్ ఇవ్వాలని శివసేన పట్టుబడుతోంది. 
 
ఈ మేరకు బీజేపీ నుంచి లిఖిత పూర్వక హామీని డిమాండ్ చేస్తోంది. అలా చేస్తేనే తమ మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధిష్ఠానం బీజేపీకి తేల్చి చెప్పింది. అయితే శివసేన డిమాండ్లను అంగీకరించేందుకు బీజేపీ ఏ మాత్రమూ సిద్ధంగా లేదు.
 
ఇదే సమయంలో శివసేన నేతలు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో చర్చలు జరుపుతున్నారని, ఈ రెండు పార్టీల నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వచ్చాయి. అయితే, ఇవన్నీ అవాస్తవాలేనని, శివసేనకు మద్దతిచ్చే ఆలోచనేదీ తమ వద్ద లేదని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. 
 
మరోవైపు తమతో కలిసి పోటీ చేసిన ఎన్సీపీ మెరుగైన ప్రదర్శన కనబరచడంతో, అధికార పీఠాన్ని పొందేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం పవార్‌కు సూచించినట్టు సమాచారం. అవసరమైతే తాము పక్కకు తప్పుకుంటామని ఆ పార్టీ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.