బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 17 జులై 2018 (15:44 IST)

అది ఇల్లు కాదు.. బంగారు గని.. నోట్ల కట్టలు కూడా...

సాధారణంగా పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లలో డబ్బులు ఎంత ఉన్నాయి అంటే ఓ రెండు లేదా పది వేలు ఉన్నాయని చెబుతారు. అదే ఓ ధనవంతుడిని అడిగితే ఓ నాలుగు, ఐదు కోట్ల డబ్బు ఉంది అంటారు. అదే బ్యాంకులను అడిగితే.. ఓ రూ.20

సాధారణంగా పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లలో డబ్బులు ఎంత ఉన్నాయి అంటే ఓ రెండు లేదా పది వేలు ఉన్నాయని చెబుతారు. అదే ఓ ధనవంతుడిని అడిగితే ఓ నాలుగు, ఐదు కోట్ల డబ్బు ఉంది అంటారు. అదే బ్యాంకులను అడిగితే.. ఓ రూ.20, రూ.30 కోట్ల క్యాష్ నిల్వ ఉంటుంది.
 
కానీ ఆ ఇంటిని చూస్తే మాత్రం కళ్లు తిరిగి పడిపోతారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా అప్పటికప్పుడు అంత డబ్బు ఉండదేమో.. అవును ఇది పచ్చినిజం.. దొరికిన డబ్బు, బంగారం సాక్షిగా దేశం మొత్తం నివ్వెరపోయిన అతిపెద్ద ట్రెజర్‌హంట్ దొరికింది. ఐటీ దాడుల్లో దొరికిన అతి పెద్ద అమౌంట్ ఇదే కావటం విశేషం.
 
తమిళనాడు ప్రభుత్వ కాంట్రాక్టర్ సెయ్యాదురై(60) ఆఫీసులు, ఇళ్లలో రెండు రోజులుగా సాగుతున్న తనిఖీల్లో అధికారులు కళ్లు తిరిగి పడిపోయారు. డబ్బే రూ.163 కోట్ల వరకు గుర్తించారు. ఇంత డబ్బు ఇళ్లు, ఆఫీసుల్లో ఎలా పెట్టుకున్నారో కూడా అధికారులకు అర్థం కావడం లేదు. 
 
ఈ నోట్లన్నీ కూడా 2000, 500 నోట్ల రూపంలో ఉండటం గమనార్హం. బ్యాంక్ సీల్ కూడా ఓపెన్ చేయలేదు. నోట్ల రద్దు తర్వాత కూడా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా నిల్వ చేసుకున్నాడు అనేది అధికారులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. కట్టలుగా ఉన్న డబ్బును భారీ కౌంటింగ్ యంత్రాలతో లెక్కిస్తున్నారు.
 
ఇంట్లోని బీరువాలు, అల్మార్లు, పరుపులు, మంచాల కింద ఎక్కడ చూసిన డబ్బు సూట్ కేసులే.. ఏ బ్యాగ్ ఓపెన్ చేసినా.. నోట్ల కట్టలు కనిపించటంతో ఐటీ అధికారుల కళ్లు బైర్లుకమ్మాయి. 
 
ఒక్క నోట్ల కట్టలే కాదు.. బంగారమే 100 కిలోలు ఉంది. అంతా కూడా బిస్కెట్ల రూపంలో ఉంది. 100 కిలోలు అంటే.. మాటలు కాదు.. పెద్ద పెద్ద బంగారం షాపులు సైతం 100 కేజీల బంగారాన్ని తమ వద్ద ఉంచుకోరు. అలాంటిది సెయ్యాదురై అంత బంగారాన్ని ఎలా పెట్టుకున్నాడో కూడా ఎవరికీ అంతు పట్టటం లేదు. 
 
రూ.163 కోట్ల డబ్బు, 100 కేజీల బంగారం మాత్రమే కాదు.. వేల కోట్ల విలువ చేసే ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు కూడా లభ్యం అయ్యాయి. ప్రస్తుతం ఇదంతా లెక్కించే పనిలో చాలా బిజీగా ఉన్నారు ఐటీ అధికారులు.