గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2019 (16:10 IST)

మరికొన్ని క్షణాల్లో చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త.. : ఢిల్లీ అగ్నిప్రమాద మృతుడి చివరి కాల్

దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం వేకువజామున భారీ అగ్నిప్రమాదం సంభవించగా, ఈ ప్రమాదంలో 45 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన ఓ కార్మికుడు చేసిన చివరి ఫోన్ కాల్ ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తోంది. ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన ఆ కార్మికుడు చనిపోయే ముందు తన సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతడిని ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన ముషారఫ్ అలీ (30)గా గుర్తించారు.
 
ఆ ఫోన్‌ కాల్‌లో అతడు మాట్లాడుతూ.. "అన్నయ్యా.. నా చుట్టూ మంటలు దట్టంగా అలముకున్నాయి. మరికాసేపట్లో నేను చనిపోబోతున్నా. మహా అయితే, మరో రెండు మూడు నిమిషాలు అంతే. తప్పించుకునే మార్గం కనిపించడం లేదు. నేను బతికే అవకాశం ఎంతమాత్రమూ లేదు. దేవుడి దయ ఉంటే తప్ప బతికి బయటపడడం అసాధ్యం. నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో. రేపు వచ్చి నా మృతదేహాన్ని తీసుకెళ్లు. నేను చనిపోయినట్టు ఇంట్లో పెద్దలకు కూడా చెప్పు" అంటూ బోరున విలపిస్తూ చెప్పాడు. 
 
దీనికి సంబంధించిన ఆడియో ఒకటి ఇపుడు బయటకు వచ్చింది. ఈ ఫోన్ సంభాషణ విన్నవారి హృదయాలు ద్రవించుకుపోతున్నాయి. ముషారఫ్ అలీ నాలుగేళ్లుగా ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ముగ్గురు అమ్మాయిలు, ఓ కుమారుడు ఉన్నారు. అతని మృతితో ఆ కుటంబం ఇపుడు రోడ్డున పడింది.