గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (05:54 IST)

సహచరిపై అనుమానంతో గునపంతో దాడి.. ప్రియుడూ హతం...స్టేషన్‌లో హంతకుడు

పెళ్లి కాకపోయినా ఆరేళ్ల నుంచి తనతో సహజీవనం చేస్తున్న మహిళ వేరొకరికి దగ్గర కావడం సహించలేకపోయిన అతగాడు ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని గునపంతో కసిదీరా పొడిచి పొడిచి చంపేసి పోలీసు స్టేషన్‌లో లొంగిపో

పెళ్లి కాకపోయినా ఆరేళ్ల నుంచి తనతో సహజీవనం చేస్తున్న మహిళ వేరొకరికి దగ్గర కావడం సహించలేకపోయిన అతగాడు ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని గునపంతో కసిదీరా పొడిచి పొడిచి చంపేసి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన వైనం గ్రామస్థులను వణికింపచేసింది. విశాఖపట్నం జిల్లా నాతవరం మండలంలో శనివారం తెల్లవారుజామున జరిగిన జంట హత్యలు సంచలనం సృష్టించాయి.

 
హంతకుడి పేరు రాము. ఇతడిది  కె.వి.శరభవరం పంచాయతీ శివారు కృష్ణాపురం గ్రామం. రాముకు గతంలో వివాహం జరిగింది. మొదటి భార్యకు దూరంగా ఉంటూ ఆరేళ్ల నుంచి సంధ్యారాణితో కలిసి ఉంటున్నాడు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. 
 
కొంతకాలంగా వెదురుపల్లి గ్రామానికి చెందిన కాళ్ల రాంబాబుకు సంధ్యారాణికి మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ విషయం గమనించిన రాము.. పద్ధతి మార్చుకోమని పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ మార్పు రాకపోవడంతో కొన్నాళ్లుగా కోపంగా ఉన్నాడు.

శుక్రవారం రాత్రి కృష్ణాపురం గ్రామంలో జరిగిన వివాహ వేడుకలకు రాము, సంధ్యారాణి కలిసివెళ్లారు. ఆ పెళ్లికి రాంబాబుకు కూడా వచ్చాడు. దీంతో రాము అనుమానం మరింత బలపడింది. పెళ్లి సమయంలో వారిద్దరి కనుసైగలను గమనించి మద్యం మత్తులో ఉన్నట్టు నటించాడు. అర్ధరాత్రి సమయంలో నిద్ర వస్తోందని సంధ్యారాణితో కలిసి ఇంటికి వెళ్లిపోయాడు. 
 
రాము మత్తుగా పడుకున్నాడని భావించిన ఆమె పెరట్లో వేచివున్న రాంబాబు వద్దకు మెల్లగా జారుకుంది. తన సహచరి, ఆమె ప్రియుడు ఒక్కచోటకు చేరేక కిరాతకంగా హతమార్చాడు. రాము పథకం ప్రకారం గునపంతో ఇద్దరిపై దాడి చేశాడు. వారి కళ్లు, ముఖాలపై కసి తీరా కొట్టి ప్రాణాలు తీశాడు.

కేకలు విని చుట్టుపక్కల వారు ఏం జరిగిందని వెళ్లి చూడగా రాంబాబు, సంధ్యారాణి రక్తం మడుగులో పడివున్నారు. రాము వెంటనే నాతవరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.