ప్రభాస్, త్రిష జంటగా నటించిన 'బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై' చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని ఆ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో మోహన్బాబు పాత్ర హైలెట్ అని ఆయన అన్నారు.
కె.ఎస్. రామారావు నిర్మాతగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై చిత్రం ఆడియో ఇటీవల చెన్నైలో సూపర్స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఆడియో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకలు గురువారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలోని సెట్లో జరిగాయి.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ బుజ్జిగాడు చిత్ర నిర్మాత కె.ఎస్. రామారావు గారు నిర్మించిన చాలా చిత్రాలు తాను చూశానని తెలిపారు. ఓసారి కె.ఎస్.రామారావు గారి ఆఫీసుకు వెలితే గోడపై చిరంజీవి, కోదండరామిరెడ్డి, ఇళయరాజా, యండమూరి వీరేంద్రనాథ్ పోటోలతో పాటు తన పోటో కూడా గోడకు తగిలించి ఉండడం చూశానన్నారు.
ఎందుకిలా తగిలించారని రామారావు గారిని అడిగితే తనకు ఇష్టమైన వ్యక్తుల పోటోలు అలా తగిలించానని ఆయన తెలిపారు. తనంటే రామారావు గారికి ఎంత ఇష్టమో అప్పుడు తనకు తెలిసిందని పూరీ అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ తాము ఎంతో ఇష్టపడి బుజ్జిగాడు చిత్రాన్ని తీశామని తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుందని అన్నారు.
ఈ చిత్రంలో మోహన్బాబు నటించడం వల్ల చిత్రానికి మరింత అందం వచ్చిందని ఆయన అన్నారు. చిత్రానికి సందీప్ చౌతా చక్కని సంగీతాన్ని అందించారని పూరీ ప్రశంసించారు. నిర్మాత మాట్లాడుతూ చిత్రాన్ని మే 16న విడుదల చేయనున్నట్టు చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ఎన్.టి.వి. ఛైర్మన్ నరేంద్రచౌదరి తదితరులు చిత్ర యూనిట్కు ప్లాటినం డిస్క్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాజల్, సందీప్చౌతా, దిల్రాజు, సుబ్బరాజు, రాజారవీంద్ర, వైష్ణోకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
|