1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

పెద్ద నిర్మాతలు X చిన్న నిర్మాతలు

వినోదం వెండితెర కథనాలు తెలుగు చలన చిత్ర రంగం పెద్ద అంతరం రాష్ట్ర ప్రభుత్వం టిక్కెట్ పెంపు ధర
WD
తెలుగు చలన చిత్ర రంగంలో అంతర్గతంగా దాగివున్న చిన్నా.. పెద్ద.. అంతరాలు మరోసారి బయటపడ్డాయి. ప్రభుత్వం కలిసివచ్చే విషయాల్లో అప్పుడప్పుడు ఒక్కటిగా ఉండే వీరంతా నేడు వేరువేరుగా కుంపటి పెడుతున్నారు. వారం రోజుల నాడు రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాల టిక్కెట్ పెంపు ధరను రద్దుచేస్తూ జీవో జారీ చేస్తే దానికి హర్షం వ్యక్తం చేస్తూ చిన్న నిర్మాతలు సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు. కానీ.. జీవో విడుదలైన వారంరోజుల వరకు పెద్ద నిర్మాతలు వేచిచూసి ఫిలింఛాంబర్ అధ్యక్షుడుగా కె.ఎస్.రామారావు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు నష్టాల్ని మిగుల్చుతుందని చెప్పారు.

అదే విధంగా టిక్కెట్ ధరను హైక్లాస్ 35 నుంచి 50 రూపాయలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెండు వారాల పెంపును దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు భారీ బడ్జెట్‌తో సినిమాలను తీస్తున్నామని చెప్పారు. వెంకటేష్ నటించిన "చింతకాయలరవి" సినిమా విడుదల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేయాల్సిందిగా డి.సురేష్ బాబు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది. దీనితో నిర్మాతగా తనకు నాలుగు కోట్ల నష్టం వస్తుందని "చింతకాయలరవి" నిర్మాత నల్లమలుపు బుజ్జి వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, శనివారం నాడు చిన్న నిర్మాతలంతా ఐక్యమై రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ముందు పలు సమస్యలుంచారు. పెద్ద నిర్మాతలు కోరినట్లుగా థియేటర్ టిక్కెట్లు రేట్లు పెంచకూడదని, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో కూడా సామాన్యుడు చూసేట్లుగా వంద రూపాయల నుంచి 35 రూపాయలకు టిక్కెట్లు తగ్గించాలని సూచించారు.

అలాగే మార్నింగ్‌షోలు టాక్స్ పరిధిలోకి రావు కనుక తప్పనిసరిగా చిన్న సినిమాలను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని, పది ప్రింట్ల నుంచి 35 ప్రింట్లలోపూ సినిమాలకు టాక్స్ ఎత్తివేయాలని కోరారు.

అదే విధంగా లొకేషన్స్‌కు చెల్లించే పేమెంట్స్‌లో చిన్న చిత్రాలకు 50 శాతం రాయితీ ఇవ్వాలని, కళాత్మక, సామాజిక అంశాలు గల చిత్రాలకు, చిన్న పిల్లల చిత్రాలకు కల్పించే రాయితీలు వీటికి కల్పించాలని వారు కోరారు. చిన్న పిల్లలతో నిర్మించే నిర్మాతలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఆగిపోయి ఉన్నాయి కనుక, వాటిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పరిశీలించి తగు చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు.
About Writer
Selvi