వరదబాధితుల కోసం తెలుగు చిత్ర పరిశ్రమ శనివారం (నవంబర్-7) స్టార్నైట్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరుకానున్న ఈ కార్యక్రమం హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరుగనుంది.
శనివారం సాయంత్రం 5.40 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో నందమూరి హీరో బాలకృష్ణ "భువనవిజయం" డ్రామాలో కీలక పాత్ర పోషిస్తారు. ఫ్లడ్ రిలీఫ్ కమిటీ ఛైర్మన్ బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం కీరవాణి పాటతో ఆరంభమవుతుంది. మ్యూజికల్ నైట్ (సంగీతవిభావరి)లో 25 గాయకులు, 14 సంగీత దర్శకులు పాల్గొంటారు.
స్టార్నైట్ ద్వారా లభించిన ఆదాయాన్ని ఫ్లడ్ రిలీఫ్ కమిటీ కన్వీనర్ దర్శకరత్న దాసరి నారాయణ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్యకు అందజేస్తారని తెలిసింది. ఇందులో భాగంగా సుమారు.. పదికోట్ల రూపాయల చెక్కును వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రికి అందజేయనున్నారు.
ఇందులో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు సౌత్ ఇండియన్ ఫిలింఛాంబర్, నడిగర్ సంఘం సభ్యులు, నటీనటులు, హిందీ సినిరంగానికి చెందిన ప్రముఖులు హాజరవుతారు.
ఇదిలా ఉంటే.. వరదబాధితుల సహాయార్థం యావత్ తెలుగు చిత్రపరిశ్రమ గచ్చిబౌలి స్టేడింలో నిర్వహించే 'స్టార్నైట్'కు ఇండస్ట్రీ టాప్ హీరో కుటుంబాలు చేతులు కలపలేదని తెలిసింది.
అక్కినేని కుటుంబానికి చెందిన నాగార్జున, నాగచైతన్య, సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి చెందిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్, మెగాస్టార్ కుటుంబ వారసులు రామ్చరణ్ తేజ, అల్లు అర్జున్తో పాటు పీఆర్పీ అధినేత చిరంజీవి కూడా ఈ కార్యక్రమంపై అంతగా ఆసక్తి చూపడం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.