శివసేన చీఫ్ బాల్ థాకరేతో డ్రింక్ తాగడానికి వెళ్లమంటే వెళతాను.. కానీ క్షమించమని చెప్పేందుకు వెళ్లమంటే మాత్రం... ఊహుఁ అంటున్నాడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. ఐపీఎల్ క్రికెట్ వ్యవహారంలో పాకిస్తాన్ క్రికెటర్ల గురించి తాను చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పు లేదనీ, అటువంటప్పుడు దానిగురించి తను పునరాలోచించాల్సిన అవసరం లేదని షారుక్ తెగేసి చెప్పాడు.
శివసేన హెచ్చరికల నేపధ్యంలో లండన్ నుంచి వచ్చిన షారుక్ ఖాన్కు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శివసేన వ్యాఖ్యలపై షారుక్ స్పందిస్తూ... తాను ప్రపంచంలోని దేశాలన్నిటితో మంచి సంబంధాలు కలిగి ఉండాలని ఆకాంక్షిస్తాననీ చెప్పుకొచ్చారు. తను మాత్రమే కాదు ప్రతి ఒక్క పౌరుడు ఇలాగే ఉంటాడని విశ్వసిస్తానన్నాడు.
ఒకవేళ బాల్ థాకరే తనను తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే.. కలిసి డ్రింక్ తాగేందుకు వెళతాననీ, కానీ క్షమించమని అడిగేందుకంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని షారుక్ అన్నాడు. అసలు తప్పు చేయనప్పుడు క్షమించమని అడిగే అవకాశం ఎక్కడుందని ఎదురు ప్రశ్నించారు. మొత్తమ్మీద సేన- షారుక్ లడాయి ఇప్పట్లో తెగేదిలా కనబడటం లేదు.