దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించేందుకు బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మలు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ 'రోబో' చిత్రం నిర్మితమవుతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో రజనీ సరసన ఐశ్వర్యారాయ్ హీరోయిన్గా నటిస్తోంది.
అలాగే.. మరికొందరు బాలీవుడ్ హీరోయిన్లు ఆయన సరసన నటించేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. వీరిలో మనీషా కోయిరాలా, దియామిర్జా, తులిప్ జోషి, రాఖీ సావంత్, ప్రియాంకా చోప్రా, అమోఘ తదితర హీరోయిన్లు ముందు వరుసలో ఉన్నారు. రాఖీ సావంత్ మరో అడుగు ముందుకేసి, రజనీకాంత్ సమ్మతిస్తే ఆయన్ను వివాహం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.
దీనిపై సావంత్ మాట్లాడుతూ.. రజనీ చాలా ఉన్నతమైన వ్యక్తి. రజనీకి ఇద్దరు కుమార్తెలు ఉన్నప్పటికీ.. ఆయన ఇంకా యువకుడిగానే కనిపిస్తారు. ఎంతో స్టైలిష్గానూ ఉంటారు. ఆయన సమ్మతం తెలిపితే వివాహం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
అయితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ను పెళ్లి చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న రాఖీ సావంత్.. రజనీ, సల్మాన్లను ఒకేలా చూడరాదన్నారు. ముఖ్యంగా సల్మాన్తో పెళ్లి చేసుకున్నప్పటికీ.. రజనీతో ఒకటి లేదా రెండేళ్ళ ఒప్పంద కాలపరిమితితో పెళ్లి చేసుకోవాలని ఆసక్తి చూపుతున్నట్టు ఆమె తెలిపారు.
ఇకపోతే ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ.. జేమ్స్బాండ్, రజనీలతో ఒకే సమయంలో నటించాలనే కోరిక ఉన్నట్టు చెప్పారు. రజనీతో నటించే అవకాశం వస్తే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ చేసుకోనని తేల్చి చెప్పింది. తులిప్ జోషి, దియా మిర్జా, అమోఘలు మాత్రం రజనీతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.