పాప్ కింగ్, మైఖేల్ జాక్సన్కు చెందిన కోట్ల రూపాయల విలువైన జాక్సన్ ఎస్టేట్ ఆయన తల్లికి, పిల్లలకు చెందనుంది. పాప్ సంగీత ప్రపంచాన్ని కొన్నేళ్లపాటు శాసించిన మైఖేల్ జాక్సన్ (50) గతవారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. 2002లో మైఖేల్ జాక్సన్ రాసిన ఓ విల్లు బయటపడింది.
ఆ విల్లులో జాక్సన్ ఎస్టేట్లలో ఒకటి జాక్సన్ తల్లికి, మరొకటి ముగ్గురు పిల్లలకు, మిగిలింది ధార్మిక సంస్థలకు చెందేట్లు మైఖేల్ రాశారని వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ విల్లులో జాక్సన్ తండ్రి జోసెఫ్ జాక్సన్ పేరును మాత్రం ప్రస్తావించలేదని వాల్స్ట్రీట్ పేర్కొంది. ఈ విల్లును గురువారం జాక్సన్ లాయర్ లాస్ ఏంజెల్స్ కోర్టుకు సమర్పిస్తారని సమాచారం.
ఇదిలా ఉంటే.. జాక్సన్ తన ముగ్గురు పిల్లలను అల్లారు ముద్దుగా పెంచారు. ముగ్గురు పిల్లల్లో మొదటి ఇద్దరు పిల్లలు మైఖేల్ జోసఫ్, ప్యారిస్ మైఖేల్ కాథరిని రెండో భార్య డెబ్బీరోకి పుట్టారు. మూడో బిడ్డ ప్రిన్స్ మైఖేల్-2 తల్లి ఎవరో ప్రపంచానికి ఇప్పటికీ తెలియదు.
ఈ నేపథ్యంలో.. మైఖేల్ పెద్దకొడుకు ప్రిన్స్, కూతురు ప్యారిస్లు ఆయన ద్వారా తనకు పుట్టలేదని పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ మాజీ భార్య డెబ్బీ రోవ్ (50) సంచలన ప్రకటన చేశారు. ఓ దాత ఇచ్చిన వీర్యంతో కృత్రిమ గర్భధారణ ప్రక్రియ ద్వారా వారికి జన్మనిచ్చానని "ది న్యూస్ ఆఫ్ ది వరల్డ్" పత్రికకు డెబ్బీ వెల్లడించారు.
పిల్లలంటే ఎక్కువ ఇష్టపడే మైఖేల్కు.. ఓ కుటుంబం ఏర్పాటు చేసి సంతోషపెట్టాలని ఈ పని చేశానని ఆమె అన్నారు. అయితే పారిస్ పుట్టాక మైఖేల్కు తన అవసరం తీరిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.