పాప్ కింగ్, మైఖేల్ జాక్సన్ అంత్యక్రియలు ఇంకా జరగలేదని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. దీంతో జాక్సన్ అంత్యక్రియలు ఇప్పటికీ వీడని మిస్టరీగానే మిగిలి ఉంది. పదిరోజుల క్రితమే హాలీవుడ్ హిల్స్లోని శ్మశానవాటికలో అత్యంత రహస్యంగా మైఖేల్ జాక్సన్ అంత్యక్రియలు జరిగాయని వార్తలొచ్చాయి.
కానీ ఈ వార్తలను జాక్సన్ తండ్రి కొట్టిపారేశారు. ఇంకా అనువైన స్థలం కోసం అన్వేషిస్తూనే ఉన్నామని చెప్పారు. జాక్సన్ తల్లి కూడా ఇదే మాటే అంటోంది. తన కుమారుని అంత్యక్రియలు ఇంకా జరగలేదని స్పష్టం చేసింది.
అంతేకాదు.. వీలైనప్పుడల్లా చూసుకునేందుకు వీలుగా మైఖేల్ జాక్సన్ భౌతికకాయాన్ని ఓ "కోల్డ్ రూం"లో ఉంచామని కేథరిన్ తెలిపినట్లు మిర్రర్.కో.యూకే వెబ్సైట్ పేర్కొంది.
ఇదిలా ఉంటే.. అభిమానుల సందర్శనకు అనువుగా జాక్సన్ భౌతికకాయాన్ని పూడ్చిపెట్టి సమాధి కట్టాలని కేథరిన్ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే జాక్సన్ మృత దేహాన్ని తాత్కాలికంగా హాలీవుడ్ హిల్స్లోనే మరోచోట సమాధి చేసి ఉంచారని మిర్రర్. కో.యూకే వెల్లడించింది.
గుండెపోటు కారణంతో 50 ఏళ్ల పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్.. జూన్ 25వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే. పాప్ గాయకుడిగా పాప్ సామ్రాజ్యాన్ని శాసించిన మైఖేల్.. డాన్సర్, కొరియోగ్రాఫర్, వాణిజ్యవేత్త, పాటల రచయిత, రికార్డ్ ప్రొడ్యూసర్, నటుడిగా తన హవాను కొనసాగించి ప్రపంచ దేశ ప్రజల దృష్టిని తనవైపు మళ్లించుకున్నాడు.