Ooha Chitram| Vamsi Krishna| Kaveri Jha| Romantic Thriller | జూలై 10న తెరపైకి వస్తోన్న ''ఊహాచిత్రం''
ప్రముఖ నిర్మాత కె. పైడిబాబు లిఖిత్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన "ఊహాచిత్రం" ఈ నెల 10వ తేదీన తెరపైకి రానుంది. డా. పెదవీర్రాజు సమర్పణలో నూతన దర్శకుడు సత్య మలచిన ఈ చిత్రంలో వంశీకృష్ణ-కావేరీ ఝాలు జంటగా నటించారు.
ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న "ఊహాచిత్రం" వైవిధ్యమైన కథాంశంతో జూలై పదోతేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర సమర్పకుడు పెదవీర్రాజు అన్నారు. షూటింగ్, సెన్సార్, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని సమర్పకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్మాత కె. పైడిబాబు మాట్లాడుతూ.. సిటీ బ్యాక్డ్రాప్లో నడిచే ఈ చిత్రం రొమాంటిక్ థ్రిల్లర్గా రూపొందిందన్నారు. సోలో హీరోగా వంశీకృష్ణ చేస్తున్న తొలి చిత్రమిదని, ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్ట్లా ఎక్కడా ఇబ్బంది పడకుండా డాన్స్లుగాని, ఫైట్స్గానీ చాలా అద్భుతంగా చేశాడని కితాబిచ్చారు.
దర్శకుడిగా సత్యకి ఇదే మొదటి సినిమా అయినప్పటికీ ఇప్పటి ట్రెండ్కు అనుగుణంగా అతను రెడీ చేసిన సబ్జెక్ట్ తననెంతో ఇంప్రెస్ చేసిందని నిర్మాత తెలియజేశారు. దానికి తగ్గట్టుగానే వి.ఎన్. సురేష్ కుమార్ ఫోటోగ్రఫీ, శివ మ్యూజిక్ చాలా అద్భుతంగా వచ్చాయని, రీ-రికార్డింగ్ ఈ సినిమాకు హైలైట్ అవుతుందని నిర్మాత వివరించారు.
జీవా, సూర్య, బబ్లు, శ్రీధర్, విజయ్, సుధీర్, ఢిల్లీ రాజేశ్వరి, తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: సురేంద్ర కృష్ణ, సంగీతం: శివ ఆర్. నందిగామ్, ఛాయాగ్రహణం: వి.ఎన్. సురేష్కుమార్, ఆర్ట్: ఎస్. వి. రాజమౌళి, ఎడిటింగ్: రమేష్, కో-డైరక్టర్స్: సుధాకర్రెడ్డి, ఆనంద్బాలాజి.
