అబ్బాస్, టబు ప్రధాన పాత్రల్లో నటించిన ఇదీ సంగతి చిత్రానికి చంద్ర సిద్దార్ధ నిర్మాణ, దర్శకత్వ సారధ్యంలో రూపొందింది. జాన్ పి వర్కి సంగీతం అందించిన ఈ చిత్రం ప్రస్తుతం సమాజం ఏ తీరులో ఉందో... మానవుల్లో పెరుగుతున్న స్వార్ధం, అత్యాశ వంటి అంశాలను ప్రధానంగా తెరకెక్కించారు.
కథలోకి వెళ్తే... ఓ పత్రికలో క్రైమ్ రిపోర్టర్గా పనిచేస్తుంటాడు సత్యమూర్తి (అబ్బాస్) అతని భార్య టబు. అదే పత్రికలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తుంటాడు నీలాద్రి (సునీల్) ఇతని భార్య హేమ. బాగా డబ్బులు సంపాదించాలనే ఆశతో సత్యమూర్తి పైరవీలు చేస్తుంటే.. అతని భార్యేమో పెద్ద కోటీశ్వరులవ్వాలనుకునేంత అత్యాశ గలది.
సరే.. ఓసారి ట్రైన్ యాక్సిడెంట్ని కవర్ చేసేందుకు సంఘటనా స్థలానికి వెళ్లిన సత్యమూర్తి, నీలాద్రీలు అక్కడ శవాలపై దొంగలు పడి వస్తువుల్ని దోచుకోవడం చూస్తారు. సహజంగానే ఆశ ఎక్కువగా ఉన్న సత్యమూర్తి కూడా దోచుకునేందుకు సంసిద్ధమవుతారు. ఈ క్రమంలో ఓ ఏసీబోగీలోని రెండు సూట్కేస్లను దొంగలించి హుటాహుటిన ఇంటికి చేరుకుంటారు.
సత్యమూర్తి తెచ్చుకున్న కాదు కాదు దొంగిలించిన సూట్కేసు వజ్రాలతో నిండి ఉంటుంది. అది ఎవరిదో కాదు.. స్వయాన దేశ ప్రధానిది. దాని విలువ సుమారు రూ. 500 కోట్లకు పైగానే ఉంటుంది. ఇంతలో ప్రధాని సూట్కేస్ సంఘటనలో పోయిందన్న విషయం తెలుసుకున్న రైల్వే మంత్రి వెంటనే వెతికి తీసుకురావాలంటూ పోలీసు విభాగానికి ఆదేశాలు జారీ చేస్తాడు.
ఇలా పైనుంచి వచ్చి క్రింది స్థాయి ఆ ప్రాంత స్థానిక పోలీసులకు ఈ విషయం వెళుతుంది. వారు వెంటనే అప్రమత్తమై సంఘటన జరిగిన ప్రాంతానికి దగ్గరలోని కాలనీపై అనుకోకుండా కన్నువేస్తారు. వెంటనే ఆ కాలనీలో సత్యమూర్తి, అతని భార్య హుందాతనం చూసి అనుమాన పడతారు. దాంతో సత్యమూర్తిని కిడ్నాప్ చేసి వజ్రాలను కూడా కొట్టేయాలని చూస్తారు.
విషయం తెలుసుకున్న టబు తన భర్తను కాపాడుకునేందుకు లాయర్ (బ్రహ్మాజీ)ని సంప్రదిస్తుంది. విషయం తెలుసుకున్న లాయర్కు కూడా ఆశ పుడుతుంది.. వజ్రాలను నొక్కేయాలని. ఇక ఇలా కాదని.. తన భర్తను విడిచిపెడితే వజ్రాలు ఎక్కడున్నాయో వెల్లడిస్తానంటుంది టబు.
ఆమె కోరినట్లుగానే అబ్బాస్ పోలీస్ నిర్భంధం నుంచి బయటపడతాడు. ఆ తర్వాత వజ్రాలు పోలుసులకు చిక్కాయా.. చిక్కినా వారు వజ్రాలను ఎక్కడికి చేర్చారు.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. ప్రేమదేశంలో అబ్బాస్, టబు జంట అని టాక్ వచ్చినా ఈ సినిమాలో ఆ టాక్ ఉపయోగపడలేదు. అంతేకాక ఈ సినిమా ఆరంభం అయినప్పటి నుంచి అందరివీ నెగెటివ్ పాత్రలే.
మంత్రలో ఛార్మి అందాల్ని పబ్లీసిటీకి వాడుకున్నట్లు.. ఈ చిత్రంలో టబు తన అందాన్ని ఆరబోసినా.. అంతగా నప్పలేదు. అయితే ఫస్ట్హాఫ్లో కోటశ్రీనివాసరావు.. అతని అసిస్టెంట్గా నటించిన ఎంఎస్ పాత్రలు కాసేపు ప్రేక్షుకల్ని నవ్విస్తాయి. ద్వితీయభాగంలో మాత్రం కథ ఏదో పోతోంది అన్నట్లుగా ఉంటుంది. ఒకరకంగా స్క్రీన్ప్లే కూడా ఈ చిత్రానికి పెద్ద మైనస్ పాయింట్.
తర్వాత నటుడు రాజా ఒక దొంగ పాత్రలో కాసేపు నటించాడు. ఇక పోతే నిధికోసం ఆరాటపడేలాంటి కథలు ఇంగ్లీషులోను.. తెలుగులోను చాలా వచ్చినా.. అవన్నీ ఎంటర్టైన్మెంట్ పరంగా సాగేలా ఉండేవి. అయితే ఇదీ సంగతి చిత్రం మాత్రం అందుకు భిన్నంగా ఉండటం చూస్తుంటే.. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏం చేస్తారో అనిపిస్తుంది.
|