తారాగణం... శ్రీహరి, రాజా, గజాలా, నిఖిత, బాలాదిత్య, రంగనాథ్, వేణుమాధవ్, జయప్రకాష్రెడ్డి, ముఖేష్ రుషి తదితరులు. పతాకం... నందీ ప్రొడక్షన్స్ సంగీతం... మణిశర్మ నిర్మాత... ఎం.శివకుమార్ దర్శకత్వం... ఎ.మల్లిఖార్జున్
విలన్ పాత్రల నుండి కథానాయకుడి పాత్రల వరకు ఎదిగిన విలక్షణ నటుడు శ్రీహరి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా "నువ్వొస్తానంటే నేనొద్దాంటానా" చిత్రంతో మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తరువాత అదే కోవలో "ఢీ", "వియ్యాలవారి కయ్యాలు" చేసిన శ్రీహరి తాజాగా "భద్రాద్రి" సినిమాతో అన్ని రకాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో ముందుకొచ్చారు. ఇక కథలోకెళ్తే...
భద్రాద్రి అనే ఊరిలో ప్రజలు బాగోగులు చూసుకునే ఊరి పెద్ద రంగనాథ్. ఆయన కుమారుడు రఘురామ్ (శ్రీహరి). ఆ ఊర్లో ఓసారి అగ్నిప్రమాదం సంభవించి (బ్లోఅవుట్) చాలామంది అగ్నికి ఆహుతవుతారు. పొలాలన్నీ నిరుపయోగంగా మారుతాయి. దీంతో... ఇక్కడ జీవించలేమని ఆ ప్రాంత ప్రజలు గ్రామాన్ని వదిలి వెళ్లిపోతుంటారు.
అలా వెళ్ళిపోతున్న వారిని ఆపిన రంగనాథ్ పక్క ఊరిలో ఉన్న తన పొలాన్ని సాగుచేసుకుని ప్రజలకు చెపుతాడు. అలా వారు కాలం వెళ్లదీస్తుండగా, ఓ వింతజబ్బు సోకి 20 మంది పిల్లలు అకాల మరణానికి గురవుతారు. దీనికి చాలా వేదనపడ్డ రంగనాథ్ ఆరోగ్యమంత్రి (జయప్రకాష్రెడ్డి)ని తమ ఊరికి డాక్టర్ని పంపమని విన్నవించుకుంటాడు. అయినప్పటికీ ఫలితం శూన్యం. దీంతో అసలే సున్నిత మనస్కుడైన రంగనాథ్ ఊరి ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నానన్న బాధతో ఆత్మహత్య చేసుకుంటాడు.
తండ్రిలాగే ఊరి ప్రజల బాగుకోసం పరితపించే రఘురామ్ తన తమ్ముడైన చందు (బాలాదిత్య)ను మెడిసిన్ చదివించి ప్రజలకు వైద్యం చేయించాలని అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా తమ్ముడిని మెడిసిన్ చదివిస్తాడు. ఈ క్రమంలో తమ ఊర్లో ప్రజలు బ్లో అవుట్ వల్ల చనిపోలేదనీ, కేవలం అది జరిగిన తరువాత ఇచ్చిన మందుల వల్లనే మరణించారని చందు కనిపెడతాడు. ఈ విషయాన్ని అందరికీ చెప్పేస్తాడన్న భయంతో మందుల కంపెనీ యజమాని శంకర నారాయణ (ముఖేష్ రుషి), ఆరోగ్యమంత్రి ఇద్దరూ కలిసి చందుని చంపేస్తారు. తరువాత ల్యాబ్లో జరిగిన ప్రమాదంలో చందు చనిపోయాడని చెబుతారు.
|