కమల్హాసన్ అద్భుతమైన నటన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలగలసి తెరపై వెలసిన ఓ దృశ్యకావ్యం 'దశావతారం'. కమల్హసన్ పది పాత్రలకు తోడు ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో అసిన్, నెపోలియన్, మల్లికా షెరావత్, జయప్రద తదితరులు నటించారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ- రవివర్మ, ఆర్ట్- భరణి, సంగీతం- హిరేషి రెషమ్మియా, నేపథ్య సంగీతం- దేవీశ్రీప్రసాద్, సంభాషణలు- వెన్నెలకంటి, నిర్మాత- ఆస్కార్ రవిచంద్రన్, కథ, స్క్రీన్ప్లే- కమల్హాసన్, దర్శకత్వం- కే.ఎస్.రవికుమార్.
విశ్వశాంతి కోసం ప్రయత్నించిన ఓ శాస్త్రవేత్త పరిశోధనను విధ్వంసకారుల చేతికి చిక్కకుండా చివరకు ఎలా రక్షించబడింది అన్నదే ఈ చిత్రం పాయింట్.
కథా విషయానికొస్తే ప్రతి సంఘటనకు ఎక్కడో అక్కడ సంబంధం ఉండి తీరుతుందన్న విషయాన్ని ఓ నిండు సభలో చెబుతుంటాడు కమల్. అక్కడినుంచి సినిమా కథ 12వ శతాబ్ధానికి చేరుకుంటుంది. ఆ కాలంలో శైవులకు, వైష్ణవులకు మధ్య విద్వేశాలు తారాస్థాయిలో భగ్గుమంటుంటాయి.
అలాంటి తరుణంలో చోళరాజు రెండవ కుళోత్తుంగుడు (నేపోలియన్) వైష్ణవుడనే వాడు లేకుండా చేయాలని చూస్తాడు. ఆ రాజును రంగరాజనంబి (కమల్) ఎదిరిస్తాడు. దాంతో రాజు వైష్ణవుల ఆరాధ్య దైవమైన గోవిందరాజు స్వామి విగ్రహానికి నంబిని కట్టి సముద్రంలో కలిపేస్తాడు.
అక్కడి నుంచి కట్ చేస్తే 2004లో అమెరికాలోని సైంటిస్ట్ గోవింద్ (కమల్) ఓ భయంకరమైన బయోవెపన్ కనుగొంటాడు. అయితే అది అత్యంత ప్రమాదమని పరిశోధనలో కనుగొన్న గోవింద్ దాన్ని నాశనం చేయాలనుకుంటాడు. అయితే అలా చేయడానికి మిగిలిన సైంటిస్టులు ఒప్పుకోరు. దాంతో గోవింద్ ఆ ఫార్ములాతో సహా పారిపోతాడు.
ఆ సమయంలో దాన్ని అతడు ఎఫ్.బి.ఐకి పంపాలనుకుంటాడు. కానీ అది అడ్రస్ మారి ఇండియా చేరుకుంటుంది. దాంతో ఆ అడ్రస్ వెతుక్కుంటూ గోవింద్ ఇండియాలోని కృష్ణవేణి (కమల్) అనే వృద్ధురాలి ఇంటికి చేరుకుంటాడు. అయితే కృష్ణవేణి అప్పటికే దాన్ని గోవిందరాజస్వామి విగ్రహంలో వేసేస్తుంది.
|