తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం కిడ్నాప్ నేపథ్యంలో రూపొందింది. కథాగమనాన్ని అద్భుతంగా నడిపిన దర్శకుడు కథలోని పట్టును చూపించలేకపోయాడు. వైవిధ్యం కోసం శ్రీహరి నటించిన ఆ పాత్ర ఆయనకేమాత్రం మేలు చేస్తుందో అనుమానమే!
పాయింట్... పది మందికి సేవ చేయాలంటే కిడ్నాప్ చేసి వారికి సేవ చేయవచ్చనేది పాయింట్.
ఇక కథలోకి వెళ్తే... కోటీశ్వరుడైన వ్యాపారవేత్త విశ్వనాథ్ (ప్రకాష్ రాజ్) దంపతులకు సరోజ అనే కుమార్తె ఉంటుంది. సరోజను గురించి పట్టించుకునే తీరిక విశ్వనాథ్ దంపతులకు ఉండదు. ఓ రోజు స్కూల్కు వెళ్ళిన సరోజ కిడ్నాప్కు గురవుతుంది. దీంతో విశ్వనాథ్ స్నేహితుడు పోలీసు అధికారి రవి (శ్రీహరి) రంగంలోకి దిగుతాడు. రూ.20 కోట్లిస్తే కిడ్నాపర్ వదిలేస్తానంటాడు. దానితో ప్లేస్ కూడా చెబుతాడు.
మరోవైపు గణేష్, స్వామి, గోపిచంద్, అజయ్ స్నేహితులు. చెన్నైలో ఉన్న వీరు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూడాలని హైదరాబాద్కు ఓ వ్యాన్లో బయలుదేరుతారు. ఓ చోట రోడ్డు ప్రమాదంలో చిక్కుకుని వెనక్కు తిరిగి వేరే రూటులో హైదరాబాద్ బయలుదేరుతారు. అప్పటికే రాత్రవుతుంది.
అక్కడ ఓ మర్డర్ కేసులో ఇరుక్కున్న వీరిని, మర్డర్ చేసిన గ్యాంగ్ చంపాలనుకుంటుంది. వారంతా చెరో దిక్కున పారిపోతారు. ప్రాణాలతో ఎలా బయటపడాలనుకుంటుండగా వారు మరో ప్రాణాన్ని కాపాడాల్సి వస్తుంది. ఆవిడే సరోజ. అసలు సరోజను ఎవరు కిడ్నాప్ చేశారు.? ఆమెను కిడ్నాపర్ల నుంచి ఆ నలుగురు ఎలా కాపాడారు అనేది మిగిలిన సినిమా.